అమ్మాయి తల్లి దండ్రులు దూమ్, దామ్ అంటూ దర్జాగా బంధువుల మద్య అంగ రంగ వైభవంగా పెళ్లి చేశారు. బంధువులు, సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లి వేడుక జరిగింది. అంతా హ్యాపీ... పెళ్లి కూతురు కూడా అత్తారింటికి బయల్దేరారు. కుటుంబసభ్యులంతా నవవధువును కారెక్కించి అత్తారింటికి సాగనంపారు. అయితే అత్తారింటికి వెళ్లకముందే నవ వధువు ఆత్మహత్యకు ప్రయత్నించింది. దారిలోనే ఓ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అసలు ఎందుకు ఆమె అలా చేసింది అనేది మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు..
పెళ్లి అయిన వెంటనే తన కూతురు చనిపోవడంతో ఆ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్ అలపుర్కు చెందిన ఓ యువతికి ఆదివారం పెళ్లైంది. ఆ తర్వాత ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పెళ్లి కూతురిని అత్తారింటికి సాగనంపారు పుట్టింటివారు.
అయితే అత్తామామలతో కలిసి కారులో బయల్దేరింది. మధ్యప్రదేశ్ షియోపూర్ వెళ్లేందుకు కారెక్కింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో కారు మధ్యప్రదేశ్, షియోపూర్ చంబల్ నదిపై ఉన్న పాళి వంతెనపై వెళుతోంది. తనకు వాంతి వస్తోందని, కారు ఆపాలని వధువు డ్రైవర్ను కోరింది. అయితే డ్రైవర్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఒక్కసారిగా స్టీరింగ్ను గట్టిగా పట్టుకుంది. దీంతో డ్రైవర్ బ్రేకులు వేయాల్సి వచ్చింది. పెళ్లికుమారుడు, అతడి తల్లిదండ్రులు ఏం జరుగుతోందో అర్థం కాక సందిగ్ధంలో వుండగానే ఆమె దూకేసింది..
వెంటనే సమాచారం అందుకున్న బందువులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు..వధువు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ గల్లంతు అయిన వధువు ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ సంఘటనపై వధువు తండ్రి స్పందించారు. పెళ్లి జరిగే సమయంలో అంతా బాగానే ఉందన్నారు. తమ కూతురు కూడా సంతోషంగానే ఉందన్నారు. ఇంతలో ఏం జరిగిందో తమకు తెలియడం లేదని కన్నీరు పెట్టుకున్నారు..