ఖమ్మం నగరంలోని కాలువ ఒడ్డు ప్రాంతంలో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం గృహంలోటాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయంగా అందిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సీఐరవి కుమార్, ఎస్ఐ ప్రసాద్, త్రీ టౌన్ ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, రామారావు, సూర్యనారాయణ దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలతో పాటు ఐదుగురు విటులను అదుపులోకి తీసుకొన్నారు. కూసుమంచికి చెందిన ఓ మహిళ వివిధ ప్రాంతాల నుంచి యువతులను, మహిళలను వ్యభిచార రొంపిలోకి లాగుతున్నట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేలిందని టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం 3 టౌన్ పీఎస్కు నిందితులను అప్పగించినట్లు తెలిపారు.
జిల్లాలో కొంతకాలం క్రితం వరకు స్తబ్దుగా ఉన్న వ్యభిచారం.. మళ్లీ ఊపందుకుంది. ఖమ్మం నగరంతోపాటు జిల్లాలో పలుచోట్లకు ఈ వృత్తి విస్తరిస్తోంది. గతంలో ఈ వృత్తిలో ఉన్నవారే సుత్రధారులుగా మారి, తతంగం నడిపిస్తున్నారు. బడాబాబుల పిల్లలను టార్గెట్ చేసి మూడుపువ్వులు ఆరుకాయలుగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఈ వృత్తిలో ఉన్నవారంతా కలసి గ్రూపులుగా ఏర్పడి జిల్లాలో పలుచోట్ల బ్రాంచిలు కూడా ఏర్పాటు చేసినట్టు వినికిడి. ఒకరికొకరు అనుసంధానంగా వ్యాపారం నిర్వహిస్తూ అభంశుభం తెలియని పిల్లలను కామపిశాచికి బలిచేస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ విద్యార్థులు అత్యధికంగా ఆకర్షితులవుతున్నట్టు తెలిసింది.
యువతుల ఆర్థిక అవసరాలను గమనించి వ్యభిచారపు రోంపిలోకి దింపుతున్నారు. ఫోన్లో విటులను ఆహ్వానిస్తున్నారు. ఒక్కో విటుడి వద్ద వెయ్యి రూపాయల నుంచి రూ.10వేలు వసూలు చేస్తున్నారు. ఖమ్మం నగరంలో సంపన్న వర్గాలు, ఉన్నత ఉద్యోగులు నివసించే ప్రాంతాలుగా చెప్పుకునే శ్రీనగర్ కాలనీ, వీడియోస్ కాలనీలలో, ఇండ్లు అద్దెకు తీసుకుని కొందరు మహిళలు వ్యభిచార గృహాలను నడుపుతున్నారు. పోలీస్ నిఘా పెట్టిన ప్రతిసారి మకాం మార్చడం, లేదంటే కొద్ది రోజులు వ్యాపారం బంద్పెట్టి అంతా సర్దుమణిగిన తర్వాత తిరిగి మరల ప్రారంభిస్తున్నారు.