రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ, పరిపాలనా పరిణామాలను గమనిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. చెవిలో చిన్నమాట-అని నేతలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా.. ఆ పార్టీ మేనిఫెస్టో మేరకు సీఎం తీసుకునే నిర్ణయాల మేరకు ఏ స్థాయిలో ఉన్న అధికారులు అయినా పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందించాల్సి ఉంటుంది. ఇది ఎక్కడైనా కామన్గా జరిగే ప్రక్రియే! కానీ, ఇప్పుడు వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలో మాత్రం దీనికి భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. జగన్ ఇస్తున్న లక్షల కొద్దీ జీతాలను తీసుకుంటూనే ఎల్లో మీడియా సేవలో తరిస్తున్నారనే వాదన ప్రధానంగా పార్టీని కలవరపెడుతోంది.
ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి.. తమకు ఏదైనా కష్టం వస్తే.. నేరుగా ఉన్నతాధికారికి విన్నవించుకుని ఆసమస్యను పరిష్కరించుకునే వెసులుబాటు అన్ని ప్రభుత్వాల్లోనూ ఉంటుంది. కానీ, దీనికి భిన్నంగా ఏపీలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక మీడియాను సదరు అధికారులు ఆశ్రయిస్తున్నారు. లోపాయికారీగా.. తమకు ఉన్న సమస్యలపై లీకులు ఇస్తున్నారు. వాటిని పరోక్ష కోణంలో ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న విషయం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇలాంటి లీకులు ఇచ్చే వ్యవహారం.. ఏదో దిగువస్థాయి అధికారులు చేశారనుకుంటే.. సరేలే! అని పైఅధికారులకు చెప్పుకొనేందుకు అవకాశంలేక.. ఇలా చేశారని సరిపెట్టుకోవచ్చు.
కానీ, ఉన్నతస్థాయిలోనే అధికారులు, సలహాదారులు కూడా ఎల్లో మీడియాను ఆశ్రయిస్తుండడం ఇప్పుడు వైఎస్సార్ సీపీ నేతలను కుదిపేస్తోంది. తాజాగా జరిగిన పీవీ రమేష్ ఉదంతం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ప్రభుత్వ సలహాదారుగా పీవీ రమేష్ను నెత్తిన పెట్టుకున్నది సీఎం జగనే. ఆయన చెప్పిన సలహాలు, సూచనల మేరకు జగన్ అనేక రూపాల్లో అనేక పథకాలను మార్పులు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు రమేష్ను వేరే శాఖలకు మార్చాలనే ఉద్దేశంతోనో.. లేక రాజధాని మార్పుకారణంగానో.. ఆయనను పక్కన పెట్టారనేది వాస్తవం. ఆయనకు ఉన్న శాఖలను కుదించారనేది కూడా నిజమే! అయితే... ఎల్లో మీడియా మాత్రం అనూహ్యంగా ఆయనను భుజాన మోసేసింది.
సలహాదారుగా ఉన్న పీవీ రమేష్ శాఖల తగ్గింపుపై కన్నీరు కార్చేసింది. దీనికి కులం కార్డును కూడా జత చేసింది. దళిత అధికారి.. దళిత అధికారి.. అంటూ కులగజ్జిని పామేసింది. అయితే, ఇంటర్నల్ వ్యవహారంగా ఉండాల్సిన పీవీ రమేష్ వ్యవహారంపై ఎల్లో మీడియా ఇంతగా కన్నీరు పెట్టుకోవడానికి, జగన్కు దురుద్దేశాలను, దళితులకు వ్యతిరేకమనే ముద్రను వేయడానికి ప్రధాన కారణం.. సదరు అధికారేనని వైఎస్సార్ సీపీ నేతల మధ్య చర్చగా ఉంది. `చెవిలో చిన్నమాట` అంటూ.. దీనిపైనే చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ సొమ్ము తీసుకుని.. ఎల్లో మీడియా సేవలో చాలా మంది అధికారులు ఉన్నారని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయంపై అధినేత, సీఎం జగన్ కూడా సీరియస్గానే ఉన్నారని చెప్పుకొంటున్నారు. మరి ఈ విషయం మున్ముందు బహిరంగం అవుతుందో లేదో చూడాలి.