కర్నాటకలో ఓ కాలేజీలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కాపీ కొట్టకుండా వారి తలలకు అట్టపెట్టెలు అమర్చడం వివాదాస్పదమైంది. దీంతో ఇందుకు బాధ్యుడైన నిర్వాహకుడు అధికారులకు క్షమాపణ చెప్పారు.హవేరీ నగరంలోని భగత్ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో ఇటీవల మిడ్ టెర్మ్ ఎగ్జామ్స్ నిర్వహించగా విద్యార్థులు కాపీ కొట్టకుండా ఉండేందుకంటూ ఓ అధ్యాపకుడు వారి తలలకు అట్టపెట్టెలు అమర్చారు.

 

నాలుగు వైపులా మూసి ఉన్న అట్టపెట్టెలకు ఒక వైపు ముఖం వెడల్పున రంథ్రం చేసి వాటిని విద్యార్థుల తలలకు పెట్టారు. అలా చేయడం వల్ల వారు ఎదురుగా ఉన్న ప్రశ్నపత్రం, జవాబు పత్రం తప్ప పక్కకు తిరిగి చూడడానికి వీలుండదన్న ఉద్దేశంతో వారు ఈ పనిచేశారు.విద్యార్థులు అలా పరీక్షలు రాస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడి అధికారులు స్పందించారు. విద్యార్థులతో అలా పరీక్షలు రాయించిన నిర్వాహకుడు ఎం.బి.సతీశ్‌ను ప్రశ్నించారు.

 

దీంతో ఆయన క్షమాపణ చెబుతూ లేఖ రాశారు.''ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడూ చేయబోనని జిల్లా ఉప కమిషనర్‌కు రాత పూర్వకంగా క్షమాపణ చెప్పాను'' అని సతీశ్ చెప్పారు. అయితే, సతీశ్ తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. తాను విద్యార్థుల సమ్మతితోనే అలా చేశానని, వారే అట్టపెట్టెలు తెచ్చుకుని తలలకు తగిలించుకుని పరీక్షలు రాశారని ఆయన అన్నారు.''ఇలా చేయమని ఎవరినీ బలవంతం చేయలేదు. ఆ ఫొటోల్లో చూస్తే కొందరు అట్టపెట్టెలు పెట్టుకోని విద్యార్థులూ కనిపిస్తారు. కొందరు కాసేపు పెట్టుకుని తరువాత తీసేశారు. కానీ, ఆ ఫొటో వైరల్ అయిపోయింది'' అన్నారాయన.

 

''ఇది కేవలం ప్రయోగపూర్వకంగా చేశాం. జపాన్, చైనాల్లో ఇది సర్వసాధారణం. ముంబయిలోనూ ఇలా కొన్ని చోట్ల చేసినట్లు వార్తలొచ్చాయి'' అన్నారు సతీశ్.''ఇలా చేసేటప్పుడు పిల్లలకు ఏం చెప్పారన్నది కీలకం. సరదా కోసమే అని చెబితే ఫరవాలేదు. అంతేకానీ, మీరంతా కాపీ కొడుతున్నారు కాబట్టి ఇలా చేయండి అంటే మాత్రం అది వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ప్రపంచం తమను నమ్మడం లేదన్న భావన వారిలో ఏర్పడుతుంది'' అని సైకాలజిస్ట్ అచిరా చటర్జీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: