ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా చేసుకునే హిందూ పండుగల్లో తీజ్ ఒకటి. కొత్తగా పెళ్లైనవారు తమ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకుంటూ ఆ రోజు పూజలు చేస్తారు. ఈ పండుగ జరుపుకునే మహిళలు రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రంతా గంట గంటకూ ప్రార్థనలు చేస్తారు.అందుకోసం చేసుకుంటున్న ఏర్పాట్ల గురించి నా స్నేహితురాలు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఫోన్లో చెప్పింది.

 

కానీ, తీజ్ పండుగ నాడు ఉదయాన్నే ఆమెకు పీరియడ్స్ మొదలయ్యాయి. దాంతో ఉపవాసం, పూజలు చేయడానికి వీళ్లేదని తన తల్లితో పాటు, అత్తింటివాళ్లు అన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ పూజ గదిలో కూడా అడుగుపెట్టొద్దని, పూజకు వాడే వస్తువులను కూడా తాకవద్దని ఇంట్లో ఉండే పెద్దలు షరతులు పెట్టారు.ఇప్పటి వరకు కేరళలోని శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళల ప్రవేశంపై నిషేధం ఉండేది. అది కొన్ని వందల ఏళ్లుగా కొనసాగింది.

 

అయ్యప్ప స్వామి జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నారని, అందుకే ఈ ఆలయంలోకి పీరియడ్స్ వచ్చే వయసులో ఉన్న మహిళలను అనుమతించడంలేదని దేవస్థానం చెబుతూ వచ్చింది.ఆ నిషేధాన్ని సవాల్ చేస్తూ 2006లో 'భారత యువ న్యాయవాదుల సంఘం' సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దాదాపు 13 ఏళ్ల పాటు సాగిన విచారణల తర్వాత ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో తుది తీర్పు వెలువరించింది.

 

కేవలం రుతుస్రావం కారణంతో ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కల్పించిన సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ పూజ చేసేలా ఆచారాలు, సంప్రదాయాలు తప్పక అనుమతించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు గురించి టీవీల్లో చూస్తున్నప్పుడు, నా మదిలో యుక్తవయసులో ఉన్న నా మేనకోడలు మెదిలింది. తనకి రెండేళ్ల క్రితమే పీరియడ్స్ ప్రారంభమయ్యాయి. పీరియడ్స్ సమయంలో గుడికి, పూజ గదికి వెళ్లకూడదంటూ నానమ్మ హెచ్చరించిందంటూ ఓ రోజు తను నాతో మెల్లగా చెప్పడం గుర్తుకొచ్చింది.

 

"ఒక రోజు పీరియడ్స్ సమయంలో బాగా ఆకలి వేసి అన్నం తిందామని కిచెన్‌లోకి పరుగున వెళ్లి గిన్నె మూత తీశాను. వెనకాలనే మా నానమ్మ వచ్చి నన్ను తిట్టింది. మా అమ్మ ఇంకా ఎక్కువ తిట్టింది" అని చెబుతూ ఎందుకు అలా అంటారు? అంటూ నన్ను అమాయకంగా ప్రశ్నించించింది. అందుకు నా దగ్గర సమాధానం లేదు.ఒక్క నా మేనకోడలు మాత్రమే కాదు, దేశంలో వేలాది మంది బాలికలు ఆ ప్రశ్నకు సమాధానం కోసం చూస్తున్నారు.ఇప్పుడు శబరిమల ఆలయంలో మహిళల నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. మరి, ఎన్నో ఏళ్లుగా మన మెదళ్లలో పేరుకుపోయిన ఇలాంటి మూఢవిశ్వాసాలను తొలగించుకునేది ఎన్నడు?పీరియడ్స్ సమయంలో వంట గదికి వెళ్లేందుకు తలుపులు తెరిచేదెన్నడు?

మరింత సమాచారం తెలుసుకోండి: