సంక్రాంతి సీజన్ వస్తే చాలు తెలుగు సినిమా రంగానికి సందడే సందడి. ఆంధ్రాలో కోడిపందాలకు ఎంత డిమాండో ఆ తర్వాత స్థానం అగ్రహీరోల సినిమాల పైనే అంటే అతిశయోక్తి కాదు. కోడిపందాలలో కోట్లు, హీరోల సినిమాలకు వేల నుంచి లక్షల్లో పందాలు వేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఈ ట్రెండ్ ఇప్పటిదికాదు ఒకప్పుడు సీనియర్ స్టార్లయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్బాబు నుంచి మొదలై అది చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ల వద్దకు వచ్చేసరికి తారాస్థాయికి మారిపోయింది. అయితే కేవలం అప్పటి అభిమానులు తమ వ్యతిరేక హీరోల పోస్టర్లు చించడం లేకపోతే కరపత్రాలతో దాడులు వేచుకోవడం తప్ప మరే విధమైన ఆవేశకావేశాలు ఉండేవి కావు.
అగ్ర హీరోలు సైతం ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో తమ అభిమానులకు నచ్చచెప్పడం చేసేవారు. కొన్ని చోట్ల హీరో అభిమాన సంఘాల తరపున పేదలకు పండ్లు, అన్నదానాలు, రక్తదానాలు వంటి సామాజిక కార్యక్రమాలను ఎన్నో నిర్వహించేవారు. ప్రస్తుతం ట్రెండ్ పరిశీలిస్తే అగ్రహీరోలే తమ నిర్మాతలను ఫలానా తేదీకే సినిమాను విడుదల చేయమని శాశించే స్థాయికి మారిపోయింది. గత కొన్ని నెలలుగా అలవైకుంఠపురం, సరిలేరునీకెవ్వరు చిత్రాల విడుదల విషయంలో ఎంతో గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.
ఇద్దరూ ఒకరోజు అటూఇటుగా విడుదల చేసుకుంటే బావుండేది. కానీ ఇద్దరు హీరోలు కూడా తమ నిర్మాతల పై ఒత్తిడి తెచ్చిరెండు సినిమాలు ఒకేసారి విడుదల చేసుకునే పరిస్థితి వచ్చింది. దీని వల్ల రెండు భారీ సినిమాల నిర్మాతలు లాభం కన్నా నష్టాలబాటనే పట్టవలసి వస్తోంది. థియేటర్లు రెండు సినిమాలు పంచేసుకుంటే వచ్చే లాభాన్ని చెరో సగం పంచుకోవల్సి వస్తుంది. 2017లో సంక్రాంతికి చిరంజీవి కంబ్యాక్ చిత్రం ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ వందొవ చిత్రం గౌతమీపుత్రశాతకర్ణి ఒక్కరోజు తేడాతో విడుదలయ్యాయి. కానీ వారిద్దరూ ఎవ్వరూ కూడా ఎటువంటి ఇగోలకు పోకుండా అటు మెగా ఫ్మామిలీ హీరోలు కడా బాలయ్య సినిమా హిట్ అవ్వాలని ట్వీట్లు పెట్టారు.
అలాగే ఇటు నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా ఇద్దరి హీరోల సినిమాలు హిట్లు కావాలని కోరుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఇద్దరు పెద్ద హీరోలు రావడంతో అప్పుడు బాక్సాఫీస్ అంతా ఒక్కసారిగా హీటెక్కింది. అయినా కూడా వాళ్ళకు అప్పుడు ఎటువంటి ఇగోలు లేవు. అయితే దాదాపు మూడేళ్ళ తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితే వచ్చింది. మరి ఇప్పుడు మహేష్, బన్నీ మాత్రం ఎందుకోగాని రాజీపడడానికి ఇష్టపడడంలేదు. సినిమాల మొదలైనప్పటి నుంచి కూడా మహేష్ తన సినిమా గురించి ఏదైన అప్డేట్ ఇస్తే వెంటనే బన్నీ ఇచ్చేవారు, లేదంటే ఆ సినిమావాళ్ళు అప్డేట్ ఇస్తే వీళ్ళు సాయంత్రానికల్లా వీళ్ళు ఇచ్చేవారు ఎందుకోగాని వీరిద్దరూ మాత్రం మొదటి నుంచి పందెంకోళ్ళ వలె పోటీ పడుతూనే ఉన్నారు. ఇలాంటి ఇగోలు, పంతాలు, పోటీల వల్ల పెద్ద హీరోలే మిగిలిన వాళ్లకు వేరే మెసేజ్ ఇచ్చినట్లవుతుంది. ఇలాంటి విషయాల్లో అందరూ కలిసి కూర్చుంటేనే ఇండస్ట్రీకి మంచిది.