రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదికి వచ్చిన నాటి నుంచి కూడా అమరావతిలో ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. రోజు రోజుకు ఇక్కడ ఆందోళనలు, నిరసనలు పెరుగుతున్నాయి. ప్రజలు తమ తమ పనులు కూడా మానుకుని ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని మీడియాల్లో రోజూ ఇవే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో దూర ప్రాంతాల్లోని వారు ఇంకేముంది.. జగన్ ప్రభుత్వంపై ఏడు మాసాల్లో నే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందే! అని చర్చించుకునేలా చేస్తున్నాయి.
దీనికి తోడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, వామపక్షాలు కూడా రోజుకో విధంగా దీనిని రాజకీయం చేస్తుండడం గమనార్హం. దీంతో సహజంగానే దూర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇక్కడేదో జరుగుతోందనే భావన వస్తోంది. అయితే, తాజాగా కొన్ని నేషనల్ మీడియా బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను కదిలించాయి. ఈ క్రమం లో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ప్రజల్లో రాజధానిపై ఆందోళన ఉన్న మాట వాస్తవమే. ఇక్కడ రాజధాని వస్తే.. తమ భూములకు, ఇళ్లకు ధరలు పెరగడంతోపాటు కొన్ని ఉపాధులు కూడా లభిస్తాయని ఇక్కడి ప్రజలు ఆశలు పెంచుకున్నారు.
అయితే, ఒక ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటుతో హైదరాబాద్లో జరిగినట్టే అభివృద్ది అంతా కూడా అమరావతిలోనే కేంద్రీకృతం అవుతుందని భావిస్తున్న జగన్ సర్కారు రాజధానిని వికేంద్రీకరించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే కమిటీలు వేసి.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది. అయితే, దీని ని వ్యతిరేకిస్తూ.. రాజధాని ప్రాంత రైతులు ప్రజలు ఆందోళనకు దిగారు. కాగా, ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే.. జగన్ ఏడు మాసాల పాలనలో కేవలం రాజధానిపై తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తుండడం గమనార్హం.
అదే సమయంలో జగన్పై ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం చేయకపోవడం గమనించాల్సిన విషయం. మీడియాతో మాట్లాడుతున్న ప్రజలు కూడా జగన్పై తమకు వ్యతిరేకత లేదని, కేవలం రాజధానిని మాత్రమే అమరావతిలో ఉంచాలని కోరుతున్నామని చెబుతున్నారు. అంతేతప్ప.. గతంలో మాదిరిగా మొత్తం ప్రభుత్వం పై వ్యతిరేకత మాత్రం ఇప్పుడు లేక పోవడం గమనార్హం. సో.. దీనిని బట్టి జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉందనే విషయం స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు.