యూటర్న్ అంకుల్! అని వైసీపీ నేతలు ఏ సమయంలో అన్నారోగానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మాటను నిజం చేస్తున్నారు. గతంలో అనేక విషయాల్లో ఆయన యూటర్న్ తీసుకున్నారు. ముందు ఒక వాదం తీసుకోవడం అది ప్రజల్లో రివర్స్ అయ్యే సూచనలు కనిపించడంతో తూచ్.. నేను ఆ కాంటెస్ట్లో అనలేదు.. నాది కూడా మీ మాటే..! అంటూ యూటర్న్ తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేక హోదా కావొచ్చు.. కేంద్రంలో చెలిమి / వైరం కావొచ్చు.. బీజేపీతో స్నేహం కావొచ్చు.. కాంగ్రెస్లో చెలిమి కావొచ్చు.. పవన్ తో నేస్తం కావొచ్చు.. ఏది తీసుకున్నా కూడా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు.
ముఖ్యంగా కాపుల విషయంలో నూ ఇలానే వ్యవహరించారు. దీంతో చంద్రబాబుకు యూటర్న్ నేత అనే పేరు నిలబడి పోయింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో మూడు రాజధానుల విషయం చర్చకు వచ్చింది. సాక్షాత్తూ సీఎం జగన్ అసెంబ్లీలోనే ఈ విషయాన్ని వెల్లడించారు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తొలుత దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చంద్రబాబు.. రాజధానుల వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమా ? ఇది పిచ్చి తుగ్లక్ నిర్ణయం అంటూ వ్యాఖ్యానించడమే కాకుండా అమరావతి ప్రాంత రైతులను ప్రజలను ఓ వర్గం ప్రజలను కూడా రెచ్చగొట్టారు.
ఉద్యమాలకు నిరసనలకు పూర్తి వ్యతిరేకం అయిన చంద్రబాబు.. తానే స్వయంగా వాటిలో పాల్గొని మరిం తగా వాటిని రెచ్చగొట్టారు. అయినా కూడా ఉద్యమాలను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. మరోపక్క, జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికే ప్రాధాన్యం ఇచ్చింది. దీనికి తోడురెండు కమిటీలు కూడా రాజదాని అమరావతి భౌగోళికంగా కూడా రాజధానికి పనికిరాదని నివేదికలు ఇచ్చాయి. దీంతో జగన్ ప్రభుత్వం విశాఖ దిశగానే అడుగులు వేయడంతథ్యంఅనే విషయం ఖరారైంది.
దీంతో ఉలిక్కిపడిన చంద్రబాబు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. తానే విశాఖను డెవలప్ చేశానని, రాజధానికి ఉండాల్సిన అన్ని లక్షణాలూ విశాఖకు ఉన్నాయని, తానే ఐటీని అక్కడ అభివృద్ధి చేశానని చెప్పుకొస్తున్నారు. సో.. మొత్తంగా విశాఖను రాజధానిగా పనికిరాదని అనే సాహసం మాత్రం ఆయన చేయలేక పోయారు. దీంతో మరోసారి ఆయనను యూటర్న్ అంకుల్ అంటున్నారు వైసీపీ నాయకులు.