రాజకీయాల్లో తలపండిన నాయకులకే పాఠాలు చెప్పగలనని చెప్పుకొనే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయ నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు ఏం చేసినా కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏ డాది జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి అధికారం పోగొట్టుకున్నాక.. పార్టీ పరిస్థితి వ్యక్తిగతంగా రాజకీ యంగా చంద్రబాబు పరిస్థితి కూడా డోలాయమానంలో పడ్డాయి. దీంతో వీటిని గెయిన్ చేసుకునేందుకు తన హవాను నిరూపించుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా.. ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఏపీలో జగన్ సీఎం అయ్యి ఏడు నెలలు దాటుతోంది. జగన్ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. యువ ముఖ్యమంత్రిగా దూసుకుపోతున్నారు. అయితే జగన్పై ఎటాక్ చేసేందుకు బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని పోరాటాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బాబు చేపట్టిన ఇసుక దీక్షకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే రాని పరిస్థితి. ఇక ఏ చిన్న విషయం దొరికినా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పార్టీని నిలబెట్టుకోవడంతోపాటు.. రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఏర్పడిందనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అయితే, ఆయన వేస్తున్న స్టెప్పులతో పార్టీ నిలబడడం లేదు సరికదా.. ఆయనపైనా పార్టీలో నమ్మకం కుదరడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు చంద్రబాబు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. తాజాగా రాజధాని ఉద్యమానికి సంబంధించి అనేక రూపాల్లో ఫలించేలా ప్రయత్నించారు. అయితే, బాబు ఒక్కడి వల్లా పరిస్థితి సానుకూలంగా లేదని గ్రహించిన ఆయన మహిళలను పురమాయించారు. రాజధాని ప్రాంతంలో ఉన్న పల్లెల్లో ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం రంగంలోకి దిగుతున్నారు. వీళ్లంతా రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎప్పుడూ ఎండకన్నెరెగని ఆయన సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని రంగంలోకి దింపారు. ఆమె రావడం ఆవేశంగా మాట్లాడడం, గాజులు బహూకరించడం తెలిసిందే. అయితే, ఇవి కూడా రాజకీయంగా వ్యతిరేక ఫలితాన్నే ఇచ్చాయి. బాబు ఎంత భావోద్వేగం రెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నా జనాల్లో ఆ సంఘటనపై సరైన స్పందన లేనప్పుడు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా బాబు నిర్మాణాత్మక పాత్రే పోషించడంలో ఫెయిల్ అవుతున్నారు.
ఆయన ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు తీసుకున్న ఏ ఒక్క నిర్ణయము సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. చివరకు తన రాజధాని మహిళలతో పాటు తన భార్యను కూడా రంగంలోకి దింపి భావోద్వేగాలతో లబ్ధి పొందాలని చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ.. జగన్ ప్రభుత్వం దిగిరాకపోగా.. విశాఖ సహా మూడు రాజధానుల పై ప్రజల నుంచి కూడా గట్టి సంకేతాలు వస్తుండడంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారని సీనియర్లే చర్చించుకుంటున్న పరిస్థితి టీడీపీలో కనిపిస్తోంది. దీంతో అసలు చంద్రబాబు వ్యూహాలు ప్రతిదీ బెడిసి కొడుతున్నాయని, ఆయన మరింత షార్ప్గా ఆలోచించాలనే సూచనలు వస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.