నేతాజీగా ప్రజల మనసుల్లో నిలిచిన మహానాయకుడు, దేశ భక్తుడు శుభాష్ చంద్రబోస్. నేటికీ ఈ దేశ యువతకు ఆయన ఆదర్శం. ఆయన ఆలోచనా విధానం, ఆయన వ్యూహాలు, ఆయన పరాక్రమాలు ఆదర్శం. తరచుగా పలువురు రాజకీయ నేతలు కూడా ఈయన గురించి స్మరిస్తూనే ఉంటారు. ఈ నెల 23 న శుభాష్ చంద్రబోస్ జయంతి. 1897, జనవరి 23న ప్రస్తుత ఒడిసా రాష్ట్రంలోని కటక్లో(అప్పట్లో బ్రిటీష్ ప్రెసిడెన్సీ) జన్మించారు. చిన్ననాటి నుంచి ఆయన దూర దృష్టిగల వ్యక్తిగా గుర్తింపు పొందారు. దేశభక్తి, పట్టుదల, సౌర్య పరాక్రమాలకు ఆయన పెట్టింది పేరు.
అప్పటి బ్రిటీష్ పాలకులను ఈ దేశం నుంచి తరిమికొట్టాలన్న వ్యూహానికి తనదైన శైలిలో ఆయన ఆలోచ నలు పొదిగారు. బోస్లోని దేశ భక్తి ఈ దేశానికి ఆయనను ఓ చరిత్రాత్మక నాయకుడిని (హీరో) చేసింది. 1920 నుంచి 1930 వరకు కూడా ఆయన భారత జాతీయ కాంగ్రెస్లో కీలక రోల్ పోషించారు. సత్యాగ్రహంతో బ్రిటీ ష్ వారిని ఎదుర్కొనడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆయుధానికి ఆయుధంతోనే బదులివ్వాలని బలంగా విశ్వసించారు. ఈ క్రమంలో ఆయన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే రాడికల్ వింగ్ ను స్థాపించారు. ఈ దేశం నుంచి బ్రిటీష్ వారిని తరిమి కొట్టేందుకు ఇది ఒక్కటే మార్గమని విశ్వసించారు.
ఇక, జాతీయ కాంగ్రెస్తో ఆయన చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. 1938లో కటక్లో జరిగిన సమావేశం లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోస్ ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో బోస్ గాంధీజి సపోర్ట్ చేసిన భోగరాజు పట్టాభి సీతారామయ్యపై పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత త్రిపురలోని హరిపురలో జరిగిన 1939 సమావేశానికి బోస్ నేషనల్ కాంగ్రెస్లో బలమైన నేతగా ఎదిగారు. ఆయన తిరుగులేకుండా ఏకగ్రీవంగా విజయం సాధించారు. అయితే ఇది సహజంగానే గాంధీకి నచ్చలేదని చరిత్రకారులు చెపుతారు.
అయితే, తర్వాత కాలంలో బోస్కు కాంగ్రెస్, మహాత్మా గాంధీకిమధ్య సిద్ధాంత వైరుధ్యం ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన బోస్ సొంతగానే స్వతంత్ర పోరాటానికి దిగారు. దేశంలోని యువతను తనవైపు తిప్పుకొన్నారు. తన వాక్ పటిమతో యువతలో దేశ భక్తిని రగిలించారు. అయితే, ఒకవైపు మహాత్ముడి శాంతి పోరాటం.. మరోవైపు బోస్ ఆయుధ పోరాటం సాగుతుండడంతో దేశంలో ఒక విధమైన వాతావరణం ఏర్పడింది. దీనిని తమకు అనుకూలంగా మలుచుకున్న బ్రిటీష్ వారు బోస్ను గృహనిర్బంధం చేశారు.
అయితే, వారి నిర్బంధం నుంచి తప్పించుకున్న బోస్ 1940లో ఈ దేశం విడిచి అదృశ్యమయ్యారు. అయితే, 1945, ఆగస్టు 18న జపాన్లోని తైపే నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అయితే, దీనిపై ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే నిలిచిపోయింది. ఏదేమైనాదేశ యువతకు మాత్రం బోస్ నిలువెత్తు ఆదర్శంగా మాత్రం ఉన్నారు.