ఏమాటకామాట చెప్పుకోవాలి. చంద్రబాబు వ్యూహం అంటే వ్యూహమే. స్థానిక ఎన్నికల్లో విజయవాడ రాజకీ యాలు రగులుకున్నాయి. మేయర్ పీఠం మాకంటే మాకేనని తమ్ముళ్లు పోటీ పడ్డారు. ఈ క్రమంలో విజయ వాడలో మూడు ముక్కలాటగా టీడీపీ రాజకీయాలు మారిపోయాయి. మేయర్ పీఠం కోసం ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య అనురాధ, మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ నుంచి పాతిక ఓట్ల తేడాతో ఓడిపోయిన బొండా ఉమా కూడా తన సతీమణిని మేయర్ పీఠం పై కూర్చోబెట్టుకోవాలని భావించారు. అయితే, దీనికి విరుద్ధంగా చంద్రబాబు ఎంపీ కేశినేని నానిని బుజ్జగించే పనిలో భాగంగా ఆయన కుమార్తెకు మేయర్ పీఠాన్ని ప్రకటించారు.
దీంతో ఒక్కసారిగా గద్దె, బొండాలు ఇద్దరూ ఫైరయ్యారు. స్థానిక ఎన్నికల్లో అప్పటి వరకు కలిసి మెలిసి ప్రచా రం చేసిన నాయకులు అందరూ ఏకాకులుగా మారిపోయారు. తమ వరకు తాము అన్నట్టుగా మారిపోయారు. దీంతో నగర రాజకీయాల్లో ఒక్కసారిగా కుదుపు వచ్చింది. ఈ పరిస్థితిని సమీక్షించిన చంద్రబాబు తనదైన శైలిలో వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే చంద్రబాబు గద్దె, బొండాలకు రాయబారం పంపి మాట్లాడారు.
మీకు మేయర్ పీఠం ఇవ్వలేదని అలగవద్దని, కలిసి మెలిసి ప్రచారం చేయాలని హితవు పలి కారు. ఈ క్రమంలోనే వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇద్దరిలోనూ ఒకరికి డిప్యూటీ మేయర్ పీఠం దక్కేలా చేస్తానని వేర్వేరుగా హామీ ఇచ్చారు. ఈ పరిణామంతో ఇప్పుడు విజయవాడ రాజకీయాలు కొంత మేరకు టీడీపీలో శాంతించాయి. అయితే, ఎవ రికి డిప్యూటీ మేయర్ పీఠం దక్కుతుందనే విషయం మళ్లీ ఆసక్తిగా మారింది. అయితే, ప్రస్తుతానికి మళ్లీ డిప్యూటీ మేయర్ పీఠంపై ఆశ మాత్రం ఇరు వర్గాల్లోనూ కనిపిస్తోంది.
మరోపక్క, మేయర్ పీఠం దక్కడంతో కేశినేని శాంతించారు. పార్టీలో ఇక, తనకు తిరుగులేదని ఆయన చెప్పిందే వేదం అని ఆయన భావిస్తు న్నారు. దీంతో చంద్రబాబు వ్యూహం ఇప్పటికైతే ఫలించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, రేపు నిజంగానే ఎన్నికలు జరిగి విజయవాడ టీడీపీ వశమైతే.. డిప్యూటీ మేయర్ పీఠం విషయం మళ్లీ వివాదం కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికైతే.. పార్టీలో అగ్గి చల్లారిందని బాబు హ్యాపీగా ఉండడం గమనార్హం.