సమయం లేదు మిత్రమా.. కరోనాపై యుద్ధమా... మన మరణమా..! అన్నట్లుగా తయారైంది పరిస్థితి. కరోనా వైరస్ మహమ్మారి ఐదు దశాబ్దాల క్రితం ఈ భూమిపై అడుగు మోపింది. అయితే అప్పట్లో దానికంతా సీన్ లేదు. మాములు మందులకే తోకముడిచింది. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుదో తెలియదు గాని వెయ్యి రెట్ల శక్తితో జనం మీద పడుతోంది. తన ఆనవాళ్లు సరిగా దొరకకుండా మానవాళిక సవాల్ విసురుతోంది. రోజురోజుకో కొత్త లక్షణాన్ని బయటపెడుతూ తన శక్తి సామర్థ్యాలను చెప్పకనే చెప్పేస్తోంది. కరోనాపై ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు అంచనాకే రాలేదన్న వాదన వినిపిస్తోంది.
మాములు ఫ్లూ అనుకుని కొట్టిపారేసినా... నేను చాలా ముదురు అన్నట్లుగా..ప్రపంచ వ్యాప్తంగా 10వేల మందికి పైగా పొట్టన బెట్టుకుంది. కరోనా నియంత్రణ ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఒక పెను సవాల్....తుఫాన్కు ముందు గాలి రావడం సహజం. కానీ కరోనా మాత్రం ఎలాంటి అలజడి లేకుండా మానవాళిపై దాడి చేసింది. ప్రపంచం ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. ఓవైపు వేల మందికి విస్తరిస్తూ.. తన శక్తిని మరింత పెంచుకుంటూ వెళ్తున్న కరోనాను ఎలా కట్టడి చేయాలో అర్థం మానవాళి నిజంగానే భయంతో బిక్కచచ్చిపోయేలా ఉందంటే అతిశేయోక్తి లేదు. మానవాళిని అంతం చేయడానికే కరోనా వచ్చి ఉంటుందన్న అనుమానాలు చాలా మంది భయస్తుల గుండెల్లో నెలకొని ఉంది.
ఒక బలమైన శత్రువు దాడి చేస్తూంటే ఎదురు దాడి చేయడానికి ఏమాత్రం అవకాశం లేనివాడికి మల్లే కేవలం ఆ దెబ్బలను తప్పించుకోవడానికి రక్షణ ధోరణిని అవలంభిస్తున్నట్లు మానవాళి పరిస్థితి. కరోనాపై కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది పరిస్థితి. ఏ రూపంలో...ఏ వైపు నుంచి వస్తుందో తెలియక జనం భయాందోళన చెందుతున్నారు. వ్యాధి నివారణకు మందు, వ్యాక్సిన్ లేదు, రాకుండా చూసుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామ రక్ష అంటూ పాలకులు స్పష్టంగా చెప్పడంతో జనం కూడా అప్రమత్తమయ్యారు. జనతా కర్ఫ్యూలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని ఆశిద్దాం..పిలుపునిద్దాం.