కరోనా ఎఫెక్ట్తో ప్రపంచమే చిన్న కుగ్రామంగా మారిపోయింది. ఇప్పుడు ఎవరి ఇల్లే వారికి సినిమా హాలు, ఎమ్యూజ్మెంట్ పార్కు, ఆఫీసు.. అన్నీను! ఇలా మారిపోయిన నేపథ్యంలో పనులు లేవు. పరిశ్రమలు లేవు. దీంతో ఎక్కడికక్కడ పనులు నిలిచి పోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఈ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ఇది-అది అనే తేడా లేకుండా ప్రతి రంగంపైనా ఈ ప్రభావం పడింది. ఇక, మీడియా విషయానికి వస్తే.. ప్రస్తుతం మీడియా పనిచేస్తున్నా.. కీలకమైన రాజకీయ అంశాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. నిజానికి ఇతర రాష్ట్రాల మీడియాకు ఏపీ మీడియాకు భిన్నమైన వైఖరి ఉంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయాలు దేశంలోని మిగిలిన రాష్ట్రాల రాజకీయాలతో పోల్చుకుంటే చాలా భిన్నంగా సాగుతాయి. ఇక్కడ ప్రత్యేకంగా పుట్టిన పార్టీల కంటే కూడా .. ఒక కీలకమైన పార్టీల నుంచి వేరుగా ఏర్పడిన పార్టీలు ఉన్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలకు ప్రాధాన్యం ఉంది. తెలంగాణను తీసుకున్నా.. ఏపీని తీసుకున్నా.. భిన్నమైన పార్టీలు, స్వభావాలు ఉన్న నాయకులు ఉన్న నాయకులు ఉన్నారు. ఇక, రెండు ప్రభుత్వాలను విభేదించే మీడియా కూడా ఉంది. దీంతో ఎప్పటికప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ వార్తలు, వ్యాఖ్యానాలు, సటైర్లు, స్వోత్కర్షలు, ఎత్తడాలు, దింపడాలు.. ఇలా అనేక వార్తలు ప్రజలకు మజా పంచుతాయి.
నిజానికి కొన్ని పత్రికలు రాజకీయాలకే కీలకంగా చేసుకుని నడుస్తున్నవీ.. నడుపుతున్నవీ కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోనూ కీలక రాజకీయ నాయకులు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రాజకీయాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. పైగా ప్రజలంతా కరోనా గుప్పిట చిక్కి అల్లాడుతున్నారు. ఈ సమయంలో రాజకీయ వార్తలు వండి వార్చినా.. గ్యాసిప్లు ప్రచారం చేసినా పట్టించుకునే నాధుడు ఉండడు కదా.. పత్రికల ప్రాధాన్యం కూడా తగ్గిపోతుందనే భావన ఉంది.
ఈ నేపథ్యంలోనే కీలకమైన పత్రికలు అన్నీ కూడా రాజకీయాలు ప్రాధాన్యం తగ్గించి.. కరోనా వార్తలు, విశేషాలు. కరోనా నుంచి బయటపడేందుకు ఉన్న మార్గాలు వంటి విషయాలనే హైలెట్ చేస్తున్నాయి. దీంతో పొలిటికల్ ఫీడింగ్ తగ్గిపోయింది. కొసమెరుపు ఏంటంటే.. జగన్ వ్యతిరేక వార్తలను వడ్డి వార్చే ఆంధ్రజ్యోతిలో ఆ పత్రిక ఎండీ ఆర్కే స్వయంగా రాసే... వారం వారం వచ్చే కొత్త పలుకు ఈ వారం రాకపోవడం గమనార్హం. ఇది రాజకీయంగా గ్యాసిప్ కుప్రాధాన్యం సంతరించుకున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఆర్కే మాత్రమే కాదు చాలా పత్రికలు పేజీలు తగ్గించేస్తున్నాయి. ఎవరికి వారు ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు.ఈ నేపథ్యంలోనే కొత్త పలుకులు... ఎడిటోరియల్స్ కూడా రావడం లేదు.