కరోనా కబంద హస్తాల్లో ప్రపంచంమంతా విలవిల్లాడుతున్న వేళ.. భారత్ సైతం సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతోంది. కరోనా మహమ్మారి విలయాన్ని సరిగ్గా అంచనా వేయడంలో కాస్త తడబడినా... ఆ తర్వాత మాత్రం చకచకా చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకల కట్టడిలో సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం భారత్ పాలిట శాపాల్లా మారింది.

 

 

అయితే ఆలస్యంగా మేలుకున్నా... వేగంగానే స్పందించింది. కరోనా కేసులు వంద లోపు ఉండగానే ప్రధాని మోదీ దేశమంతటా లాక్‌డౌన్‌ విధించారు. అక్కడ వరకూ బాగానే ఉన్నా.. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో వేల సంఖ్యలో ప్రార్థనలు జరుగుతున్నా గుర్తించకపోవడం దేశంలో కరోనా ముఖ చిత్రాన్నే మార్చేసింది. మర్కజ్‌ ఘటన ఏకంగా దేశమంతా కరోనా పాకిపోయేలా చేసింది. కరోనాను దేశంలోని ప్రతి రాష్ట్రానికీ పాకించింది.

 

 

కరోనాపై భారత్ చేస్తున్న పోరాటంలో ప్రధాని నరేంద్ర మోడీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. లాక్‌డౌన్‌ విధింపులోనూ... జనతా కర్ఫ్యూ ద్వారా స్ఫూర్తి రాజేయడంలోనూ ఆయన నాయకుడనిపించుకున్నారు. అంతే కాదు.. కరోనా కాలంలో పేదలకు ఇబ్బంది పడకుండా... రాష్ట్రాలు ఉసూరుమనకుండా ముందుగానే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. అయితే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వలస కూలీలు అర్థాకలితో కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చింది.

 

 

మర్కజ్‌ ఘటన లేకపోయి ఉంటే.. భారత్ కరోనాపై చెప్పుకోదగ్గ విజయం సాధించేది అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికైనా భారత్‌లో కరోనా కట్టడిలోనే ఉంది. కానీ కేసుల సంఖ్య 5 వేలు దాటింది. లాక్‌డౌన్‌ ఇంకా పొడిగిస్తే దేశం ఆర్థికంగా కుదేలయ్యే ప్రమాదం పొంచిఉంది. అలాగని లాక్‌డౌన్‌ ఎత్తేస్తే.. కరోనా ప్రబలితే అసలే అంతంత మాత్రం వైద్యసదుపాయాలు ఉన్న భారత్ చేతులేత్తేసే పరిస్థితి రావచ్చు. ఏదేమైనా ఈ క్లిష్ట పరిస్థితి నుంచి భారత్‌ గట్టెక్కితే.. ప్రపంచంలోనే సూపర్ పవర్ గా ఆవిర్భవించే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: