రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ళ నుండి మూడేళ్ళకు రాష్ట్రప్రభుత్వం కుదించిన విషయం ఎంతగా వివాదమవుతోందో అందరికీ తెలిసిందే. పదవీ కాలం కుదించిన కారణంగా ప్రస్తుత ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉధ్వాసన అనివార్యమైంది. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలైన చంద్రబాబునాయుడు, కన్నా లక్ష్మీనారాయణ, నారాయణ, రామకృష్ణ, జనసేన నేతలు రెచ్చిపోతున్నారు. పదవీ కాలాన్ని కుదించటమంటే నిమ్మగడ్డపై కక్షసాధింపే అంటూ గవర్నర్ కు లేఖాస్త్రాలు సంధించటమే విచిత్రంగా ఉంది.

 

సరే రాజకీయంగా అధికారపార్టీ తీసుకునే నిర్ణయాలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించటం లాంటి విషయాలను పక్కనపెట్టేద్దాం. అసలు నిమ్మగడ్డ కు ఈ పరిస్ధితి ఎందుకు వచ్చింది ? అన్నది ప్రధానమైన ప్రశ్నగా మారింది. మొత్తం వ్యవహారంలో నిమ్మగడ్డ చేసిన స్వీయ తప్పిదాలే ప్రధానంగా కనిపిస్తున్నది. మొదటిదేమిటంటే ప్రభుత్వంతో మాట్లాడకుండానే స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియను ఏకపక్షంగా వాయిదా వేయటం. ప్రభుత్వంతో మాట్లాడకుండానే కేవలం ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబు డిమాండ్లకు సానుకూలంగా స్పందించటం.

 

నిమ్మగడ్డ నిర్ణయంపై ప్రభుత్వం సుప్రింకోర్టుకెక్కింది. ఆ తర్వాత పరిణామాల్లో నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోం శాఖకు ఓ లేఖ వెళ్ళింది. అందులో  శాంతిభద్రతలు క్షీణించాయని, తనతో పాటు తన కుటుంబానికి రక్షణ లేదని, అధికారపార్టీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలతో పాటు అనేక అంశాలు ప్రస్తావించాడు. ఆ లేఖలోని అంశాలు ప్రభుత్వానికి చాలా డ్యామేజింగ్ గా ఉంది. లేఖ విషయం వెలుగు చూడగానే తాను ఆ లేఖను రాయలేదని ఓ న్యూస్ ఏజెన్సీకి చెప్పాడు. ఆ లేఖను తాను రాయనపుడు మరి లేఖ విషయంలో పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు ?

 

సరే  ఈ విషయాలను పక్కన పెట్టేసినా లాక్ డౌన్ సందర్భంగా పేదలకు పంపిణి చేస్తున్న వెయ్యి రూపాయలు, నిత్యావసరాలను పార్టీల నేతలు పంపిణి చేస్తున్నారు. ఇందులో వైసిపితో పాటు టిడిపి నేతలు కూడా ఉన్నారు. అయితే వైసిపి నేతలపై చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, రామకృష్ణ ఎన్నకల కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. వాళ్ళు ఫిర్యాదు చేయగానే విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలంటూ కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించాడు. ఎన్నికల కోడ్ అమల్లో లేనపుడు ఏ పార్టీ నేతలు పంపిణి చేస్తే నిమ్మగడ్డకు ఎందుకు ? చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేయగానే ముందుగా అందులోని వాస్తవాలు నిర్ధారించుకోకుండానే కలెక్టర్లకు ఎలా ఆదేశాలిస్తాడు ? 

మరింత సమాచారం తెలుసుకోండి: