చెప్పడానికే నీతులు ఉన్నాయని నిరూపిస్తున్నాడు కొత్తపలుకు ఆర్కే! ఇదీ.. ఇప్పుడు సోషల్ మీడియా సైట్లలో కనిపిస్తున్న మాట. నిజానికి ఆర్కేగా పిలవబడే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఎప్పుడూ సోషల్ మీడియా పెద్ద కన్నేవేసి ఉంచుతుంది. ఆయన వారం వారం నీతి పలుకులు పలుకుతారు. ప్రభుత్వాలను ఏకేస్తారు. నాయకులను తూర్పారబడతారు. ఇక, ఏపీ సీఎం జగన్ అధికారంలోకి రావడాన్ని ఇప్పటికీ ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణలో నా మిత్రుడే సీఎం అని స్వగతం చెప్పుకొని క్రెడిట్ పొందుతూనే.. ఆయనను కూడా నోరార మాటలు జారడం ఆర్కేకు తెలిసిన కలం విద్య.
మరి ఇన్ని నీతులు చెబుతారు కదా? దాదాపు మూడు పదులకు తక్కువగా వేతనం లేని ప్రభుత్వ ఉద్యో గుల పట్ల అంత పక్షపాతం ప్రదర్శిస్తూ.. కలంతోనే కన్నీళ్లు పెట్టుకుంటాడుకదా మరి ఆయన సంస్థల్లో ఆయనకు ఊడిగం చేస్తున్న ఉద్యోగుల విషయంలోనూ ఇలానే ఉంటారా? నీతులు అక్కడకూడా వర్తిస్తాయా ? అంటే.. ఆ ఒక్కటీ తప్ప! అంటున్నాడు ఆర్కే! నీతులు పక్కవారికే కానీ.. తనకు వర్తించవని కుండబద్దలు కొడుతున్నాడు. తా వలచింది రంభ.. తా మునిగింది గంగ అంటూ.. మురికి ఆలోచనలతో ఉద్యోగులను రోడ్డున పడేశాడు.
ఐదేళ్ల చంద్రబాబు హయాంలో వేలాది కోట్లను ప్రకటన రూపంలో గుంజుకున్న ఆర్కే.. ఇప్పుడు 20 రోజలు లాక్డౌన్ పేరు చెప్పి ఉద్యోగులను రోడ్డున పడేశాడు. అంతేకాదు, తెలంగాణ సీఎం కానీ, ఇటు ఏపీ సీఎం కానీ, కరోనా విషయంలో అజాగ్రత్తగా ఉంటూ.. ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని, రేయింబవళ్లు పనిచేస్తున్న వైద్యులు, పోలీసులకు కనీసం మాస్కులు కూడా ఇవ్వడం లేదని రెండు రోజుల కిందట రాతలతో వాతలు పెట్టిన ఆర్కే.. తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కనీసం తన సామాజిక వర్గం వారికైనా ఒక్కమాస్కు కొనిపెట్టాడా? ఒక శానిటైజర్ను ఇచ్చారా? కనీసం ఆఫీసుల్లో అయినా జాగ్రత్తలు తీసుకుంటున్నాడా? అంటే.. లేదనే అంటున్నారు రోడ్డున పడ్డ ఉద్యోగులు.
మరి ఈ నీతులు చెప్పడం ఎందుకు బాధా కృష్ణా? నువ్వు చేస్తున్నది సంసారం అనేందుకు ఒక్క రుజువు చూపించు.. సోషల్ మీడియా నోరు మూసుకుంటుంది!! ఆ పనిమాత్రం చేయవు కదా?! అందుకే నీది అరాచకం. వారిది అధికార మదం అయితే.. నీది ఏమనాలి? కలం చాటున నువ్వు చేస్తున్నది కులం రాజకీయం కాదా?!