ఒక్క కృషి.. ఒక పట్టుదల.. అనేక విజయాలకు నాంది పలుకుతాయి. నిజానికి ఇది ఎవరికి అన్వయం అవు తుంది? అని ప్రశ్నిస్తే.. యువతకో.. లేదా మధ్యవస్కులకో వర్తిస్తుంది. కానీ, అప్పటికే జీవితంలో సగానికి పైగా ఉత్థాన పతనాలు చూసి, మనవళ్లు, మనవాళ్లు కూడా వచ్చేసి.. జీవితంలో ఇక రెస్ట్ తీసుకోవడానికే పరి మితమైన జీవితంలో ఇలాంటి సాహసం ఎవరైనా చేయగలరా? అదీ ఓ మహిళ ఇలాంటి ఆలోచన చేయగ లరా ? అంటే.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి.. వైఎస్ విజయమ్మను చూస్తే.. చేయగలరనే చెప్పాలి. ఒక ఓటమి నుంచి ఒక అవమానం నుంచి ఎదురైన అనుభవాలు ఆమెలో సహజసిద్ధంగా ఉన్న కడప పౌరుషాన్ని తట్టి లేపాయి.
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న కుటుంబాన్ని తృణప్రాయంగా ఆ పార్టీ తీసి పక్కన పెట్టినప్పుడు.. తనదైన శైలిలో ముందుకు వచ్చారు విజయమ్మ. నిజానికి ఆమె ఏం చదువుకున్నారో.. ఎవరిదగ్గర శిక్షణ పొందారో కూడా తెలియదు. కానీ, తనదైన రీతిలో ప్రజలను ఆకట్టుకోవడంలో శిక్షణ పొందారని అనుకున్న నాయకులను కూడా తోసిరాజని ప్రజల హృదయాల్లో చోటు సంపాయించుకున్నారు. తన తనయుడు స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లారు.
నిజానికి ఒకవైపు అకాల మృత్యువు కాటుతో భర్త వైఎస్ దూరమయ్యారు. ఇక, అదే సమయంలో నమ్ముకున్న పార్టీ, అప్పటి వరకు అనేక రూపాల్లో తమ కుటుంబం నుంచి సేవలందుకున్న పార్టీ ఒక్కసారిగా విషం కక్కింది. తన కుమారుడిని, కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ టార్గెట్ చేసి.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగింది. సీబీఐని ఉసిగొలిపి రాజకీయ ప్రేరేపిత చర్యలు తీసుకుని జగన్ను జైలుకు పంపింది. ఈ సమయంలో విజయమ్మ స్థానంలో మరెవరైనా ఉంటే ఎలా స్సందించేవారు? ఇంకెవరైనా ఉంటే..ఎలా ఉండేవారు? ఖచ్చితంగాకుంగిపోయేవారు. ఇక, తమకు జీవితమే లేదని భావించేవారు.
కానీ, ఎక్కడ ఎదురు దెబ్బతగి లిందో.. అక్కడి నుంచే కృషి చేశారు విజయమ్మ. పట్టుదలతో ప్రజల సమక్షంలోకి అడుగు పెట్టారు. తన కుటుంబం యావత్తు విశ్వసించిన ప్రజల వద్దకే వెళ్లి తన మొర వినిపించారు. అదే ఆమెకు అకుంఠిత బలాన్ని ప్రోది చేసింది. 2014లో ఎదురైన ఓటమి నుంచి 2019లో విజయం సాధించేవరకు ఆమె పట్టుదలతో ముందుకు సాగారు. అదే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది. ఒక కృషి.. ఒక పట్టుదల.. విజయమ్మకు దిగ్విజయాన్ని అందించింది.