పుట్టిన నాడే వదిలించుకున్న బిడ్డడు కర్ణుడి కోసం కుంతీదేవి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, దీనిలో మ ర్మం తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటే.. తెలియని వారు జాలిపడ్డారు! ఇప్పుడు వారం వారం ఆర్కే రాసే కొత్త పలుకు కూడా అలానే ఉంది. విషయం తెలిసిన వారు ఛీ కొడుతుంటే.. తెలియని వారు నిజమే కదా?! అని బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఇంతకీ ఈయన బాధ ఏంటంటే.. ప్రస్తుతం దేశాన్ని కరోనా మ హమ్మారి దేశాన్ని, ప్రపంచాన్ని కన్నీటి సుడిలోకి నెట్టేసింది. దీంతో భారత్లోనూ ప్రభుత్వం ముందుకు కదిలి లాక్డౌన్ను గత నెల నుంచి అమలు చేస్తోంది.
ఈ క్రమంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించి ఇంట్లోనే ఉండిపోతున్నారు. అయితే, ఆ మధ్య ప్రధాని మోడీ ప్రజలకు ఓ సందేశం ఇచ్చారు. మీరంతా రాత్రి 9 గంటలకు మీ ఇంట్లో దీపాలు ఆర్పి.. కొవ్వొత్తులు వెలిగించండి, లేదా నూనె దీపాలు పెట్టండి, లేదా ఫోనుల్లోని టార్చులను వెలిగించండి! ఇది మన సంఘీభావానికి ప్రతీక అన్నారు. దీనికి ముందు వారం.. అందరూ సాయంత్రం ఐదు గంటలకు ఇంటి ఆవరణల్లోకి వచ్చి.. చప్పట్లు కొట్టి వైద్యులకు, పోలీసులకు సంఘీభావం చెప్పాలని పిలుపునిచ్చారు. అయితే, ఈ క్రమంలో ముస్లిం సామాజిక వర్గం బయటకురాకుండా ఇంటికే పరిమితమైందని, చప్పట్లు కొట్టలేదు, టార్చ్లు వెలిగించలేదని ఆర్కే బాధాకృష్ణ.. తెగబాధపడిపోయారు.
అంతేకాదు.. ఈ సమయంలో అది బీజేపీనే అయినా.. మీరు సహకరించాలి.. అంటూ ముస్లింలను ఉద్దేశించి తన కొత్తపలుకులో రాతోపదేశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇది కుంతీదేవి వచ్చి.. కర్ణుడి ముందు కన్నీరు పెట్టు కున్న చందంగానేఉందని అంటున్నారు పరిశీలకులు. పుట్టిన నాడే వదిలించుకున్న కర్ణుడి కోసం ఇప్పుడు కుంతీదేవి ఏడవడం ఏంటి? అంటే.. అర్జనుడి కోసం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కర్ణుడు పరాక్రమం తెలుసుకాబట్టి.. ఆమె చివరికి ప్రాధేయ పడాల్సి వచ్చింది. నిజానికి బీజేపీ కూడా కుంతి తరహాలో ముస్లింలను వదిలించుకుంది. మోడీ, షాల నాయకత్వంలో దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే..
ఒక్కసీటు ఒక్కటంటే ఒక్క టికెట్.. ఏ రాష్ట్రంలో అయినా లేదా దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అయినా ఇచ్చారా? గెలిచారా? ఓడారా? పక్కన పెట్టండి.. ముస్లిం సామాజిక వర్గం అంటూ ఒకటుందని ఈ నేతలు కానీ, బీజేపీ పార్టీ కానీ గుర్తించిందా? అంతెందుకు తలాక్ విషయంలోనూ వారి అభిమతానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోలేదా? పేగు బంధాన్ని ఆనాడే తెంచుకున్న బీజేపీ నేతలకు.. మద్దతుగా ముస్లిలు నేడు చప్పట్లు కొట్టలేదు.. దీపాలు పెట్టలేదని ఆర్కే వంటి లబ్ధ ప్రతిష్ట పాత్రికేయులు వాదానికి దిగడం ఆయనకే చెల్లింది!! ఇంత చేసిన బీజేపీకి ఏ ముస్లిం అయినా.. ఏ మొహం పెట్టుకుని భజన చేయాలి? దీనికి ఏమంటారు ఆర్కే?!