బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు ఆగ్రహం కట్టలు తెంచుకుని రోడ్డెక్కింది. వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తనపై చేసిన విమర్శలతో ఆయన ఒక్కసారిగా రెచ్చిపోయారు. అయితే, సీనియర్ నాయకుడు, పైగా కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా చేసిన కన్నా.. కొన్నిదశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉన్నారు. మరి అలాంటి నాయకుడు ఆచితూచి మాట్లాడాల్సింది పోయి.. అందునా రాజకీయాలను రాజకీయాలుగా చూసి ఉంటే సరిపోయేకాడికి.. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ.. రోడ్డున పడ్డా రు. ఇప్పుడు నిజానికి రాజకీయాల్లో పోకచెక్కతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా! అనే పరిస్థితులు రాజ్యమేలు తున్నాయి. ఈ సమయంలో నాయకులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా ఒక పార్టీకి అందునా జాతీయ పార్టీకి, రాష్ట్రంలో అధ్యక్షుడుగా ఉన్న కన్నా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ, అ లా కాకుండా సాయిరెడ్డిని మగాడివైతే.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గల్లీ స్థాయి నేత కన్నాదిగజార్చేలా ఉన్నాయని సొంత పార్టీలోనే నాయకులు అభిప్రాయపడుతున్నారు. నాపై విమర్శలంటే ఆకాశంపై ఉమ్మేసినట్లే. ప్రభుత్వ పారదర్శకత నిరూపిం చుకోవాలంటే మీకెందుకు పొడుచుకొచ్చింది. విజయసాయి ఇష్టానుసారం మాట్లాడితే పరువునష్టం దావా వేస్తాను. నన్ను కొనే దమ్ము ఈ భూమి మీద ఎవడికీ లేదు. నీకు దమ్ముంటే.. మగాడివైతే కాణిపాకంలో ప్రమాణం చేస్తావా?. విజయసాయిరెడ్డి అధి కార మదం తలకెక్కి మాట్లాడుతున్నారు. అని కన్నా విరుచుకుపడ్డారు.
మొత్తంగా ఈ రగడ ఎక్కడ మొదలైందంటే.. దక్షిణ కొరియా నుంచి కరోనా టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం తెప్పించింది. దీనికి సంబం ధించిన ధరలపై ఛత్తీస్గఢ్ రాష్ట్రం 375 చెపితే.. మన దగ్గర మాత్రం 725కు కొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదేసమయంలో ప్రభుత్వంలోని సీనియర్లు కూడా తలా ఒకరకంగా రేట్లను చెప్పారు. దీనిపై కన్నా ఆవేశంగా మాట్లాడారు. ఇక, కన్నా వ్యాఖ్యలకు విజయసాయి రిప్లయ్ ఇచ్చారు. కన్నా అమ్ముడు పోయారని, టీడీపీ నోటి నుంచి వచ్చిన మాటలనే కన్నా చెబుతున్నారని, ఆయన చంద్రబాబుకు అమ్ముడు పోయారని వ్యాఖ్యానించారు. దీంతో కన్నా ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. నిజమే.. తనపై వచ్చిన వ్యాఖ్యలకు ఆయన సమాధానం చెప్పితీరాలి.
అయితే,ఈ క్రమంలో తాను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిననే విషయాన్ని ఆయన మరిచిపోవడం తీవ్ర విమర్శ లకు తావిచ్చింది. గతంలో ఇంతకన్నాఎక్కువగానే టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం జరిగింది. అయితే, ఎవరూ కూడా ఇలా మగాడివైతే.. అనే రేంజ్లోవ్యక్తిగత దూషణలకు తావివ్వలేదు. పైగా సీనియర్ నాయకుడు అయిన కన్నా.. ఇలా దిగజారి మాట్లాడకుండా.. పత్రికాముఖంగానో.. మరో రూపంలోనో విజయసాయికి మంచి కౌంటర్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరో విధంగాఉండేది. కానీ, ఇలా రోడ్డెక్కినందున ప్రయోజనం ఏంటనేది ప్రధాన ప్రశ్న. అనవసరంగా యాగీ కావడం తప్ప!!