ఎస్.జానకి భారత చలనచిత్ర అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె పాటల కోసం నాటితరమే కాదు...నేటితరం కూడా చెవికోసుకుంటుందంటే అతిశేయోక్తికాదు. అభిమానులను అలరించడానికి వయస్సుతో సబంంధం లేదు అని చెప్పడానికి ఆమె గాత్రమే అందుకు సాక్ష్యం. హీరోలు, హీరోయిన్లతో సమానంగా ఒకప్పుడు ఆమె పాడిన పాటలకు అభిమానులు ఉండేవారు. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఆ సంఖ్య భారతవనిలో కోట్లలో ఉండటం గమనార్హం. ఎస్ జానకీ గారు పాడిన అనేక పాటల్లో యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో కనిపిస్తుండటం గమనార్హం. పాటను శ్రోతల మనస్సులకు హత్తుకునేలా..వారు మళ్లీమళ్లీ వినేలా పాడటం ఆమె ప్రత్యేకత.
జానకి గారు 1938లో గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించారు. తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఆయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతంపై ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతా మంగేష్కర్, పి.సుశీల, జిక్కి, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది.
నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి మద్రాసుకు మారింది. 1958లో వి.రామప్రసాద్ను వివాహమాడారు. వీరికి మురళీకృష్ణ 1960లో జన్మనించాడు. 1997లో రామప్రసాద్ గారి మరణం ఎస్.జానకి గారిని బాగా కుంగదీసింది. అప్పటి నుంచే కొద్దికొద్దిగా ఆమె సినిమాల్లో పాడటం తగ్గించేశారని సన్నిహితులు చెబుతుంటారు. 1957 లో వచ్చిన విధియిన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో ఆరంభమైన ఎస్.జానకి సినిమా జీవితం 2016 న వరకు సాగింది. 2016లో సెప్టెంబర్ నుంచి తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు పాడటం విశేషం. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనే అత్యధికంగా ఉన్నాయి. మిగతా భాషల్లోనూ ఆమె పాడారు. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం , 31 సార్లు వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తమ గాయనిగా పురస్కారం పొందారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఆమెకు ఎంతగానో కీర్తిని తెచ్చిపెట్టాయి.
ఆమె ప్రతిభకు మెచ్చిన మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను అందజేసింది. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సంత్కరించింది. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించడం ఆమెలోని సామాజిక స్పృహకు నిదర్శనమని పలువురు విమర్శకులు ఆమెను కొనియాడుతుంటారు. జానకమ్మ నేటితో 82వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఆమెకు ఆ దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుందాం..!
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple