రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల కీలక నేతల మధ్య ఏర్పడిన తీవ్ర వివాదం.. టీ కప్పులో తుఫాను మాదిరిగా సమసిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అసలు ఈ రేంజ్లో ప్రమాణాల వరకు రోడ్డున పడి మాటల యుద్ధం చేసుకోవాల్సిన అవసరం ఈ రెండు పార్టీల కీలక నేతల మధ్య ఎందుకు వచ్చింద నేది ప్రధానంగా చర్చకు వస్తోంది. కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం కమీషన్లు పుచ్చు కుందని బీజేపీ రాష్ట్ర సారధి కన్నా ఆరోపించారు. అయితే, దీనికి ప్రభుత్వం నుంచి కాకుండా అనూహ్యం వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి కౌంటర్ వచ్చింది.
కన్నా అమ్ముడు పోయాడని, అందుకే చంద్రబాబు చెప్పినట్టు ఆడుతున్నారని, టీడీపీ విమర్శలే ఆయన నోటి నుంచి వస్తున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన సొమ్మును కూడా వాడుకు న్నారని, నొక్కేశారని అన్నారు. ఈ క్రమంలోనే తనను కొనేమగాడు ఇంత వరకు పుట్టలేదని కన్నా అనడం, కాణిపాకంలోకి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసరడం. మగాడివైతే.. అంటూ సాయిరెడ్డిపై వ్యా ఖ్యలు చేయడం తెలిసిందే. మొత్తంగా ఈ ఎపిసోడ్లో కన్నాను టార్గెట్ చేసుకుని సాయిరెడ్డి ఈ రేంజ్లో రెచ్చిపోవడం వెనుక ఏదైనా కీలక పరిణామం ఉందా ? అనే చర్చ సాగుతుండడం గమనార్హం.
దీనికి సంబంధించి కొంచెం లోతుల్లోకి వెళ్తే.. అసలు విషయానికి కొంత క్లారిటీ వస్తుంది. కొన్నాళ్ల కిందట రాజధాని తరలింపు విషయంలో జోక్యం చేసుకున్న కన్నా లక్ష్మీనారాయణ రాజధానిని మార్చడానికి కేంద్ర ఒప్పుకోదని, మోడీ వచ్చి ఇక్కడ శంకు స్థాపన చేశాడని కాబట్టి ఇక్కడ నుంచి తరలించరాదని వాదించారు. ఇదే సమయంలో బీజేపీకే చెందిన నాయకుడు, ప్రకాశం జిల్లాకు మరో నేత... కన్నా వ్యాఖ్యలతో విభేదించిన విషయం తెలిసిందే. ఇరువురు నాయకులు కూడా ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలు చేసుకోకపోయినా.. నేను చెప్పిందే కరెక్ట్. అంటే నేను చెప్పిందే వేదం అన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్గా కేంద్రంలో విషయాలు తెలిసిన నాయకుడుగా, కేంద్రంతో చర్చించిన తర్వాతనే తాను చెబుతున్నానంటూ.. సదరు ఎంపీ చెప్పారు. అయితే, దీనికి భిన్నంగా కన్నా.. రాష్ట్ర చీఫ్గా నేను చెప్పిందే కరెక్ట్ అంటూ కన్నా వాదించారు. ఈ వివాదం అప్పట్లో బీజేపీని రోడ్డున పడేసింది. అయితే, ఇప్పుడు ఈ విషయం అందరూ మరిచిపోయారు. కానీ, తనకు కన్నా కౌంటర్ ఇవ్వడాన్ని తట్టుకోలేక పోయిన సదరు ఎంపీ.. సాయిరెడ్డిని వ్యూహాత్మకంగానే ప్రోత్సహించి.. కన్నాపై దాడి చేయించారని అంటున్నారు బీజేపీలోని ఓ వర్గం నాయకులు. అందుకే కన్నాను ఇంతలేసి మాటలు అంటున్నా.. సదరు ఎంపీ వర్గంగా ఉన్న నాయకులు ఎవ్వరూ కూడా నోరు మెదపకపోవడం గమనార్హం.