వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన పాలన విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రజలను తనవైపు పూర్తిగా తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలోనే పేదలను వైసీపీవైపు ఆకర్షించేందుకు ఇప్పటికే బృహత్తర పథకాలను ప్రారంభించి వాటిని సంపూర్ణంగా అమలు చేస్తున్నారు. అయితే, రాష్ట్రంలో పేదల సంఖ్య 33శాతంగా ఉంటే 55 శాతంగా మధ్యతరగతి వర్గాలు ఉన్నాయి. మరి మధ్యతరగతి వర్గాలు కోరుతున్నది ఏంటి? ఒక్క పేదలను మాత్రమే వైసీపీ తనవైపు తిప్పుకొన్నా ప్రయోజనం రాజకీయంగా అంతంత మాత్రంగానే ఉంటుందనేదివాస్తవం. ఈ నేపథ్యంలో మధ్యతరగతి వర్గాలను కూడా జగన్ వ్యూహాత్మకంగా తనవైపు తిప్పుకోవాలంటే.. రెండు కీలక అంశాలనులేదా ప్రాజెక్టులను ఆయన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
దీనిలో అత్యంత కీలకమైంది.. ఉపాధి లేదా ఉద్యోగ కల్పన. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా నాలుగు లక్షల పైచిలుకు యువతకు ఉద్యోగాలు కల్పించారు. అయితే, ఇంకా దాదాపు పది లక్షల మందిపైగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అదేసమయంలో కార్మికులు ఉన్నారు. వీరికి కూడా సరైన పని కల్పన లేదు. దీంతో వీరు కూడా పరిశ్రమ రాకకోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఎన్నికలు పూర్తిగానే తొలిప్రాధాన్యంగా రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకు స్థాపనచేశారు.
అయితే, దీనిని ముందుకు తీసుకు వెళ్లడం అనేది కేవలం రాష్ట్రం చేతుల్లోనే లేదు. దీనికి కేంద్రం నుంచి కూడా సాయం అందాలి. కానీ, కేంద్రం, మోడీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు లేవు. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా? లేదా? అనేది సమస్య. గతంలో చంద్రబాబు కూడా ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించి విఫలమై.. తానే స్వయంగా నిర్మిస్తానని ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని భుజాలపై వేసుకున్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఉక్కు కర్మాగారం నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.
ఇక, సాగునీటి ప్రాజెక్టుల్లో కీలకమైన పోలవరం పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీనిని పూర్తి చేయడం ద్వారా భారీ ఎత్తున కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆశించారు. అయితే, దీనికి కూడా నిధులులేవు. కేంద్రం ఇప్పట్లో దీనికి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. అదేసమయంలో పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాల్సి ఉన్నా.. ప్రస్తుత లాక్డౌన్ ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారింది. మొత్తంగా చూస్తే.. జగన్ ముందు ఈ సమస్యలు చాలా క్లిష్టంగానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.