ఏపీ సీఎం జగన్.. తాజాగా తీసుకున్న నిర్ణయం ఐటీ వర్గాలను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇంటి వద్ద కే పాలన అంటూ.. ప్రకటించిన జగన్.. దీనికి అనుగుణంగా వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. దీంతో దాదాపు జగన్ ప్రబుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల వద్దకే చేరుతున్నాయి. గతంలో ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం కావాలన్నా.. ఏ పథకం రూపుదిద్దుకోవాలన్నా కూడా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అనూహ్యంగా ప్రజల చుట్టూతానే ప్రభుత్వం తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
పింఛన్లు, వివిధ సేవలకు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం మానేశారు. అదేసమయంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇంటి వద్దకే టెలీ మెడిసిన్ వంటి సేవలు తీసుకువచ్చింది. అదేసమయంలో తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవ కావాలన్నా.. వలంటీర్లను సంప్రదించడం ద్వారా సులభంగా పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలా.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి.. పాలనా ఫలాలను వారికి అందిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సాంకేతిక రూపాన్ని జగన్ అందుబాటులోకి తెచ్చారు.
అదే..రేషన్ను కూడా ఇంటివద్దకే అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ మొబైల్ వ్యాన్ ద్వారా లబ్ది దారుల ఇళ్లముంగిటకే రేషన్ అందేలా చేస్తున్నారు. లబ్థిదారుల్లో ఎవరికెంత బియ్యాన్ని ఇవ్వాలన్న దానికి అనుగుణంగా తూకం వేసేందుకు వేయింగ్ మిషన్.. దానికి తోడు సంచుల్ని సిద్ధం చేశారు. ఇంటిం టికి వెళ్లి.. లబ్దారులకు ఇవ్వాల్సినంత బియ్యాన్ని వారి ముందే తూకం వేసి.. బ్యాగులో పోసి.. ఇచ్చేస్తారు. డోర్ డెలివరీకి అవసరమైన వాహనాల్ని భారీగా సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండేలా 13,370 మొబైల్ యూనిట్లను సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ తరహా వ్యవస్థ లేదనేది వాస్తవం. కానీ, అందివచ్చిన సాంకేతికత, నైపుణ్యాలను వినియోగించుకుని ప్రజలకు ఇంటి వద్దకే పాలనను చేరువచేస్తున్న వైనం.. నిజంగా గ్రేట్ అంటున్నారు పరిశీలకులు.