మాజీ సీఎం చంద్రబాబుకు తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఎదురు కానంత తీవ్రమైన సంకట పరిస్థితులు ఎదురవుతున్నాయన్నది మాత్రం నిజం. తన కంటే రాజకీయంగా చాలా చాలా తక్కువ అనుభవం.. ఇంకా చెప్పాలంటే తన రాజకీయంలో కేవలం పావు వంతు అనుభవం మాత్రమే ఉన్న జగన్మోహన్ రెడ్డి వేసే ఎత్తుల ముందు బాబోరి ప్లాన్లు అన్ని చిత్తవుతున్నాయి. జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలు.. వేగవంతమైన పాలనా సంస్కరణల ముందు చంద్రబాబు కుదేలై పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కావొచ్చు.. అటు వైజాగ్కు రాజధాని తరలింపు కావొచ్చు.. ఇటు నిమ్మగడ్డ రమేష్ తొలగింపు కావొచ్చు.. కరోనాను కట్టడి చేసేందుకు తీసుకున్న కఠిన నిర్ణయాలు కావొచ్చు.. ఏదేనా జగన్ పాలన.. ప్లాన్లు చంద్రబాబు వ్యహాలకే అందని పరిస్థితి.
వాస్తవంగా చూస్తే చంద్రబాబు జగన్ ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా తప్పు పట్టేందుకు కాచుకుని కూర్చొని ఉన్నాడు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు అన్ని సంచలన నిర్ణయాలే. ఏకంగా ఐదుగురు ఎస్సీలను కేబినెట్లో కి తీసుకోవడంతో ప్రారంభమైన జగన్ దూకుడు ఇప్పటకీ చంద్రబాబుకు అర్థం కాని పరిస్థితి. ఇక ఇప్పుడు జగన్ సర్కార్ జారీ చేసిన జీఓ 203పై నోరు మెదపలేని దయనీయ స్థితి. మరోవైపు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్ పొరుగు రాష్ట్ర మిత్రుడైన సీఎం కేసీఆర్ని లెక్క చేయడం లేదనే అభిప్రాయం క్రమక్రమంగా బలపడుతోంది.
ఇక ఈ వివాదంపై క్షేత్ర స్థాయిలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు సైతం పరోక్షంగా జగన్ నిర్ణయానికి జై కొట్టక తప్పని పరిస్థితి. దీనిని బట్టి జగన్ కు మిత్రులు .. శత్రువులు అంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ ఉండరని.. అంతిమంగా సొల్లు కబుర్లు చెప్పడం కంటే రాష్ట్ర ప్రయోజనాలు.. ఏపీ ప్రజల పరిరక్షణే ముఖ్యం అన్నది తేటతెల్లం అయ్యింది. ఇక కరోనా విషయంలో బాబోరు హైదరాబాద్ లో కూర్చుని చేసేందుకు ఏం లేకుండా పోయింది. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు చేసింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. చివరకు జగన్ సర్కార్ జారీ చేసిన జీవోపై ఇప్పటికే ఒంటి కాలితో లేస్తూ ఏదో ఒక విమర్శ చేస్తూ పొద్దు పుచ్చే చంద్రబాబు తాజా జీవోపై కొన్ని రోజులు ఆగుదామని తెలంగాణ టీడీపీ నేతలతో అన్నారట. ఏదేమైనా జగన్ దూకుడు ముందు బాబు విలవిల్లాడుతూ గిలగిలా కొట్టుకుంటోన్న మాట వాస్తవం.