వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. దీంతో అధికార పార్టీ .. భారీ ఎత్తున సంబరాలు చేసుకు నేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 30వ తేదీన నియోజకవర్గాల వారీగా సంబరాలు చేసుకుందామని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, జిల్లా సమన్వయకర్తలు, పార్టీ బాధ్యులకు సీఎం సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు ప్రభుత్వపరంగా ఈ నెల 23 నుంచి వారోత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలావుంటే, ఈ నెల 25 నుంచి మేధోమధనం పేరిట సీఎం సమీక్షలు నిర్వహిస్తారు. 25న మొదటి రోజు వ్యవసాయంపై, రెండోరోజు విద్యా శాఖ, మూడోరోజు వైద్య ఆరోగ్యశాఖ, నాలుగో రోజున వలంటీర్ వ్యవస్థ, ఐదో రోజున ప్రణాళికా విభాగంపై సమీక్ష జరుపుతారు.
ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 30న పెద్ద ఎత్తున పండుగలా నిర్వహించేందుకు నియోజక వర్గాల్లోనూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో 90 శాతం మేర నెరవేర్చా మని ప్రభుత్వం చెబుతోంది. లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ నవరత్నాల హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇచ్చారని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందు కు నాయకులు రెడీ అవుతున్నారు. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా.. ఒక ఏడాది కేలెండర్ను విడుదల చేసి.. ఎప్పుడెప్పుడు ఏయే పథకాలు అమ లు చేస్తామో ముందుగానే వెల్లడించడం వల్ల పనులు సక్సెస్ అయ్యాయని చెబుతున్నారు.
వీటిన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 30న ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు నాయకులు సిద్ధమవుతు న్నారు. అయితే, కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి మద్దతిస్తున్న నాయకులు ఉన్నారు. వీరు ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య వివాదాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి నియోజకవర్గాల్లో సంబరాలు సాధ్యమేనా? అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో అసంతృప్తులు కూడా ఇంకా పెరుగుతున్నారు.
తమకు నామినేటెడ్ పదవులువస్తాయని భావించిన వారు , ఎమ్మెల్సీ పీఠాలు వస్తాయని ఆశించిన వారు కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరి వీరంతా ఈ సంబరాల్లో పాల్గొంటారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా లాక్డౌన్ రెండు నెలలను మినహాయిస్తే.. వైసీపీ వ్యూహాత్మకంగానే ప్రజలకు చేరువైందనేదివాస్తవం అంటున్నారు పరిశీలకులు. అదే యేడాది పాలనా కాలంలో జగన్ పట్ల అందరూ సంతృప్తిగా ఉండడంతో వైసీపీలో ఎక్కడ చూసిన కళకళలు కనిపిస్తుంటే.. అదే టైంలో అటు ప్రతిపక్ష టీడీపీలో వెలవెలే కనిపిస్తోంది. అదే టైంలో టీడీపీ మహానాడు కూడా చేసుకునే స్థితిలో లేకపోవడం గమనార్హం.