కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా పత్రికా రంగం ఎంత తీవ్రమైన సంక్షోభంలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది అనుకుంటే ప్రత్యేకించి భారత దేశంలో మరింత తీవ్రంగా ఉంది. ఇక తెలుగు మీడియా ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉందో చెప్పుకోలేం. ఎప్పుడు ఏ రోజు ఏ పేపర్ మూత పడుతుందో ? ఎన్ని వందల మంది జర్నలిస్టులు.. వారి కుటుంబాలు రోడ్డున పడతాయో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్లు ఇంట్లో కూర్చుని తమ జీవితం ఎలా వెళుతుంది ? తమ భార్య.. పిల్లల జీవితాలు ఏంట్రా అని బాధపడుతుంటే.. లోపల ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు సైతం రోజును ఒక గండం గా లెక్క పెట్టుకుని ఉద్యోగం చేస్తున్నారు.
ఇక పలు ప్రధాన దినపత్రికల్లో ఉద్యోగం నుంచి తీసేసిన వాళ్లను పక్కన పెట్టేస్తే ఉన్న వాళ్లు సైతం ఏకంగా 50 శాతం కోతలతో రోజులు గడుపుకు వస్తున్న వాళ్లే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సాక్షి గురించి ఓ అదిరిపోయే న్యూస్ వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. అది కూడా తెలంగాణలో..! తెలంగాణలో సాక్షి సర్క్యులేషన్లో 3 శాతం పెరుగుదల అట.. అందులోనూ ప్రత్యేకించి హైదరాబాద్లో ఇది ఏకంగా 10 శాతం ఉందని చెపుతున్నారు. వినడానికి కాస్త షాకింగే. అయితే దీని వెనక ఓ మతలబు ఉంది.
ఈ ట్విస్ట్ ఏంటంటే కరోనా కారణం కావొచ్చు.. లేదా ఇతరత్రా అనేక కారణాలు కావొచ్చు.. పేపర్ల సర్యులేషన్ ఎలా తగ్గిపోతుందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే నమస్తే తెలంగాణ కాపీలు 50కు పడిపోతే... అదే జ్యోతి కాపీలు 40కు పడిపోతే... ఈనాడు కాపీలు 30కు పడిపోతే... సాక్షివి జస్ట్ 20కు పడిపోయాయి. సో ఈ లెక్కన చూస్తే ఈ నాలుగు ప్రధాన దినపత్రికల్లో తరుగుదల చూస్తే తెలంగాణ వరకు సాక్షి మిగిలిన వాటికంటే కాస్త తక్కువుగా తన కాపీలను కోల్పోయిందనే చెప్పాలి. అదన్నమాట ఇక్కడ పెరుగుదల అంటే..!