తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగునేలపై గర్జించిన సింహం.. నందమూరి తారక రామారావు ఉర ఫ్ ఎన్టీఆర్. మొహానికి రంగులేసుకునే వారూ రాజకీయాల్లోకి రావడమే! అనే తృణీకరణాలను తోసిరాజని.. తన కంటూ.. ప్రత్యేకతను సంతరించుకుని రాజకీయంగా ఆసేతు హిమవన్నగం ఉన్నన్నాళ్లూ.. చెరిగిపోని మచ్చ లేని నాయకుడిగా పేరు గడించిన నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. గురువారం తెలుగు గడపకు కొత్త తోరణం వచ్చి అలంకరించిన రోజు. అదే ప్రతి తెలుగు వారి గుండెల్లోనూ అన్నగారిగా ముద్ర వేసుకున్న ఎన్టీఆర్.. ఈ లోకంలోకి అడుగిడినరోజు! ఆయన పుట్టిన రోజు!!
నిజానికి భౌతికంగా మన మధ్య అన్నగారు లేక పోయినా.. తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కరూ త లుచుకునేది ఆయన పేరునే! అందుకే ఆయన భౌతికంగా లేకపోయినా.. తెలుగు వారి మనసుల్లో పార్టీల కు అతీతంగా అందరి హృదయాల్లోనూ కొలువుదీరిన అపర శ్రీకృష్ణావతారం. అందుకే ఇటీవల అన్నగారి విషయాన్ని చర్చిస్తూ.. ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఒకాయన.. అన్నగారికి మరణం ఏమిటండీ? వింత? మరిచిపోతే కదా! ఆయన చిరంజీవి!!-అంటూ తన హృదయాన్ని ఆవిష్కరించారు. నిజానికి ఇలా భావించే వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో చాలా మంది ఉన్నారు.
1923, మే 28న కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించిన అన్నగారి గురించి బాల్యంలోను.. తర్వా త చిత్ర పరిశ్రమలో ఆయన అడుగు పెట్టినప్పటి విషయాల్లోనూ చాలా మందికి తెలియని ఆసక్తికర అంశా లు ఉన్నాయి. అన్నగారి బర్త్ యానివర్సరీ సందర్భంగా కొన్ని అత్యంత ఆసక్తికర విషయాలను పంచుకుందాం.
+ 1949లోనే అన్నగారు సినీరంగ ప్రవేశం చేశారు. ఆయన తొలిసినిమా.. మనదేశం అయితే, దీనికి దర్శకత్వం వహించిన వారి గురించి చాలా మందికి తెలియదు. ఆయన సుప్రసిద్ధ దర్శకుడు ఎల్వీ ప్రసాద్.
+ నందమూరి లక్ష్మయ్య చౌదరి, నందమూరి వెంకట రావమ్మలకు జన్మించిన ఎన్టీఆర్.. సొంత బాబాయికి దత్తత వెళ్లారు. కన్నవారివద్ద చాలా తక్కువ కాలం ఉన్నారు.
+ విజయవాడ ఎస్ . ఆర్ .ఆ ర్ కాలేజీలో చదివిన అన్నగారు.. తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వత మద్రాస్ సర్వీస్ కమిషన్లో చేరారు.
+ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అన్నగారు ప్రభుత్వ ఉన్నతస్థాయి ఉద్యోగి అని! అవును. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 1947లోనే అన్నగారు ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం సంపాయించుకున్నారు. అయితే ఉద్యోగం సంపాయించుకున్నారే తప్ప.. మనసు దానిపై పెట్టలేక పోయారు. కేవలం మూడు మాసాల్లోనే దీనికి రాం రాం చెప్పారు.
+ తమిళనాడులోనూ అన్నగారు చైతన్య రథంతో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం చాలా మందికి తెలియదు. 1984లో తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. అయితే, అప్పటి అన్నాడీఎంకే అధినేత ఎంజే రామచంద్రన్ ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఆయన తనకు సన్నిహితుడు, ఏపీకి సీఎంగా ఉన్న ఎన్టీఆర్ను తమిళనాడులో తన పార్టీ తరఫున ప్రచారం చేయాలని కోరగా.. అన్నగారు అంగీకరించి.. తన చైతన్య రథంతో తమిళనాడులో పర్యటించి.. తమిళంలోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో ఎంజీఆర్ విజయం సాధించారు.
+ అన్నగారు 1983లో పార్టీ స్థాపించిన తర్వాత కూడా సినిమాల్లో నటించారు. శ్రీనాథకవిసార్వభౌమ, మేజర్ చంద్రకాంత్ వంటి లీడింగ్ సినిమాలు చేశారు. అయితే, 1978 తర్వాత ఆయనకు ఎలాంటి అవార్డు రాకపోవడం చాలా మందికి తెలియదు!! ఆయా సినిమాలు విజయవంతం అయినప్పటికీ.. ఎన్టీఆర్కు అవార్డులు రాలేదు.
+ అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం కళాకారులకు ఇచ్చే అవార్డుల్లో అన్నగారు అందుకున్న ఏకైక అవార్డు పద్మశ్రీ. కానీ, అన్నగారి తర్వాత సినీ రంగంలోకి వచ్చినవారిలో చాలా మంది పద్మభూషణ్లు అందుకున్నారు. ఇది కూడా చాలా మందికి తెలియదు.