ఏదో జరుగుతోంది.. ఇంకేదో జరిగేలా ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ? అన్ని ప్రజల మంచి కోసమే కదా చేసేది. అయినా ఏమిటీ ఎదురుదెబ్బలు. మనకే ఎందుకు ఇలా అవుతోంది. నిజంగా చిత్తశుద్ధితో ప్రజలకు మంచి పాలన అందించాలంటే ఇన్ని ఇబ్బందులు.. ఇన్ని అవమానాలు, ఇన్నిఎదురుదెబ్బలు తిన్నాలా ? గత ప్రభుత్వాలు ఇంతకంటే వివాదాస్పదంగా వ్యవహరించి, ఏకపక్షంగా ముందుకు వెళ్లినా, వారు ఎవరికీ రాని ఇబ్బంది మనకే ఎందుకు వస్తోంది..? ఇవే ఇప్పుడు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మనసులో ఉన్న భావాలు. పైకి ఈ విషయాలు జగన్ ప్రస్తావించకపోయినా, తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల దగ్గర చెబుతున్న మాటలు ఇవి. ఒక రకంగా ఆలోచిస్తే జగన్ ఆవేదనలో అర్థం కనిపిస్తోంది.
జగన్ అధికారం చేపట్టడానికి ముందు ప్రజా సమస్యలను దగ్గరుండి పరిశీలించేందుకు మండుటెండల్లో రాష్ట్రమంతా పర్యటించారు. ప్రజల కష్టాలను, కన్నీళ్లను దగ్గరుండి చూశారు. ఎవరైనా ప్రజల ఇబ్బందులు, కష్టాల గురించి చెబితే జగన్ ఇంతగా రియాక్ట్ అయి ఉండేవారు కాదేమో. స్వయంగా తానే వారి ఇబ్బందులను దగ్గరుండి చూడడంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్ ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అలాగే ప్రజలకు ఏది అవసరం ? ప్రజల మనసుల్లో ఉన్న ఆలోచనలు ఏంటో గ్రహించి ఆ విధంగా కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. కాకపోతే ప్రజల ఆకాంక్ష కంటే, తమకు రాజకీయాలే ముఖ్యం అన్నట్లుగా ప్రతిపక్షాలు అడుగడుగున జగన్ నిర్ణయాలకు అడ్డు పడటం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కోర్టుకు వెళ్లడం, కోర్టుల్లో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే విధంగా అవసరమైన సాక్ష్యాలను తయారు చేసుకోవడం, ఇలా అన్నిటిలోనూ ప్రధాన ప్రతిపక్షం టిడిపి పైచేయి సాధిస్తూ వస్తోంది.
ఇది వైసీపీ పై విజయం అని ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నా, అంతిమంగా నష్టపోతుంది ప్రజలు. ఈ విషయం ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక సాధారణ కుటుంబం తమ పిల్లలను చదివించాలంటే ఎంతగా కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అందులోనూ వారిని ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదివించడం అంటే అది వారి తాహతుకు మించిన పని. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే కోరిక ఉన్నా, తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చదివించుకోలేని పరిస్థితి. ఐతే తాము తిన్నా తినకపోయినా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించేవారు మరెందరో.
ఇటువంటి వారి కష్టాలను గ్రహించిన జగన్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే అందరి కష్టాలను తీర్చిదిద్దినట్టు అవుతుందని కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపైనా ప్రతిపక్షాల కన్ను పడింది. తెలుగు ను చంపేస్తారా అంటూ ప్రతిపక్షాలు దీనిపై రాద్ధాంతం చేస్తూ కోర్టుకెక్కాయి. కోర్టుల్లో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. వాస్తవంగా ఇందులో ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఏమి లేదు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వలన లబ్ధి పొందేది బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలే. అయినా ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాయి.
ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాల్లోనూ జగన్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులకి వెళ్లడం, దీనిపై రాద్దాంతం చేయడం వంటి చర్యలకు దిగుతున్నాయి. దీనికి తోడు మీడియాలోని ఒక వర్గం జగన్ ను వ్యతిరేకిస్తూ ఏదో జరగరాని ఘోరం జరిగిపోతుంది అనే విధంగా కథనాలు వండి వార్చుతున్నాయి. ఇటువంటి వ్యవహారాల్లో జగన్ కు ఎదురు దెబ్బ తగిలినా చివరకు నష్టపోయేది ప్రజలే. ఇప్పుడు చెప్పుకుంది కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం పైన ఇదే రకమైన పరిస్థితి ఉంది. అంతిమంగా జగన్ ప్రభుత్వం ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ప్రతిపక్షాలు ముందుకు వెళ్తూ ప్రజల ప్రయోజనాలను వెనక్కి నెట్టుతున్నారు.