ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పాలనపై అనేక రకాలైన విశ్లేషలు వస్తున్నాయి. ఈ విశ్లేషలు పలు కోణాల్లో సాగుతున్నాయి. అయితే మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. సంక్షేమం విషయంలో మాత్రం జగన్ కు మంచి మార్కులే పడుతున్నాయి. వైఎస్ జగన్ తొలినాళ్లలో బలం అంతా వైఎస్సార్ క్రేజే. వైఎస్సార్ అంటేనే సంక్షేమ పాలన గుర్తొస్తుంది.
అందుకే జగన్ సర్కారు కూడా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదు. వైఎస్సార్ కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు జగన్. ఉదాహరణకు మహానేత వైయస్ఆర్ బలహీనవర్గాల పిల్లల కోసం ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చారు. అయితే జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసి ఏకంగా వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకువచ్చారు. అలాగే అమ్మఒడి పథకం కింద లక్షల మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లే విధంగా తోడ్పాటును ఇచ్చారు.
ఇక ఇప్పుడు జగన్ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేస్తున్నారు. గతంలో వైసీపీ ఏలూరులో బీసీ సదస్సు నిర్వహించింది. ఆ సదస్సు సందర్భంగా జగన్ చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని తూచా తప్పకుండా జగన్ అమలు చేస్తున్నారు. బలహీనవర్గాల సామాజిక గౌరవం పెరిగేట్లుగా.. కొత్త కొత్త రంగాల్లో అడుగులు పెట్టేందుకు అవకాశాలు కల్పించారు ముఖ్యమంత్రి జగన్.
అంతే కాదు.. అధికారంలోకి రాగానే బీసీల సమస్యలు పరిష్కరించేందుకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా.. ప్రతి నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారన్నారు. కాంట్రాక్టుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. బలహీనవర్గాలకు చెందిన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అయితే వారి కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని జగన్ నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగానే పని చేస్తున్నారు.