ఒక్కొక్కసారి మనకళ్లను మనమే నమ్మలేం. పసిగుడ్డుగా ఉన్నప్పుడు ఈ రెండు చేతుల్లో ఒదిగిపోయిన మా అమ్మాయే.. ఇప్పుడు ఇంత పెద్దదై.. తనకు కూడా పిల్లలు పుట్టేసి.. అబ్బో.. తలుచుకుంటేనో.. ఇన్ని రోజులు.. కాదు కాదు.. ఇన్నేళ్లు ఎలా గడిచిపోయాయా? అనే విస్మయపూర్వక సందేహంతో మస్తిష్కం.. ఖంగు మంటుంది.. రాత్రంతా ఉక్కపోత.. నిద్ర పట్టలేదు. చెమటలు తుడుచుకుంటూ బయట కొచ్చి కూచు న్నా.. టైం చూస్తే.. ఐదైపో యింది. ఇంతలో స్టేడియంలో క్రికెట్ బాల్ మాదిరిగా రివ్వున దూసుకు వచ్చిన దినపత్రిక.. వరండాలోని టీపాయ్ మీద చడీచప్పుడు చేయకుండా పడింది. పేజీలు తిప్పుదును కదా.. ఒకింత ఆశ్చర్యం.. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి.. అప్పుడే ఏడాది అయిపోయింది.
పేజీల నిండా ప్రభుత్వం తాలూకు ప్రకటనలే! వివిధ పథకాలను ప్రవేశపెట్టి.. వాటిని సంపూర్ణంగా అమ లు చేస్తున్నామంటూ.. చెప్పనివి.. చెప్పినవి కూడా చేస్తున్నామంటూ.. సీఎం జగన్ ఫొటోలతో సహా అచ్చే శారు. మొత్తంగా బాగానే ఉందనిపించింది. చేసింది చెప్పుకొంటే.. తప్పులేదుకదా!? చేయని పనులు కూడా చేశామని చెప్పుకొన్న కొందరి విషయాలు .. ఆ రోజులు.. లీలగా ఇంకా గుర్తున్నాయి. కాబట్టి.. చేశామని, చేస్తున్నామని, ఇంకా చేయాల్సి ఉందని చె ప్పుకొంటున్న వైనం. బహుదూరపు బాటసారి.. ఆశావారధిపై చేస్తున్న సుదీర్ఘ ప్రయాణాన్ని తలపించింది. ఇక్కడే ఎందుకో.. నా చేతులు పేజీలను తిప్పడం ఆపేశాయి. అప్పుడే ఏడాది అయిపోయిందా?- అనే సందేహం నా నుదురుపై ముడేసింది!
కొన్ని విషయాలు అంత తేలిగ్గా జీర్ణం కావు. అలానే ఇప్పుడు జగన్ పాలన కూడా! అప్పుడే ఏడాది పూర్త యిందా? అనిపిస్తోంది! ఏడాది కిందట విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీ కారం చేసిన ఘట్టం ఆనాడు మా ఇంట్లో టీవీలో చూస్తుంటే.. మా పెద్దబ్బాయే.. మా ఇంటి పెరట్లోనే పెద్ద పండగ చేసుకున్నట్టు అనిపించలేదూ!! ఆ దృశ్యం ఇంకా కళ్లలో మెదులుతూనే ఉంది. వైఎస్ జగన్ అనే నేను.. అన్న ఆ కంచుకంఠం తాలూకు ధ్వని ఇంకా చెవుల్లోనే మార్మోగుతోంది. కానీ, ఏడాది పూర్తయి పోయింది. మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉన్న వారిని చాలా తక్కువ మందిని చూసి ఉంటానేమో.. త్రీడీ గ్రాఫిక్స్ తో జనాలను అదరగొట్టి.. బెదరగొట్టి.. తనవైపు తిప్పుకొనే మాంత్రికులను కూడా చూసి ఉంటానేమో.. కానీ, ఈయన మాటల మనిషి కాదు.. చేతల మనిషి! ఈయనో.. నడుస్తున్న చరిత్ర.. మా ఆవిడ తెచ్చిచ్చిన చిక్కటి కాఫీ.. గొంతులో గుటకలు పడుతూ.. ఆస్వాదిస్తోంది!!
అప్పట్లో బాపూగారు రామాయణం ఇతి వృత్తంగా.. అనేక సినిమాలు తీశారు. చాలా మందికి తెలిసిన సిని మా.. సంపూర్ణ రామాయణం. కానీ, దీనికి ముందు జయప్రదను సీతమ్మగా కూర్చోబెట్టి.. మరో రామాయణం తీశారు బాపు. దాని పేరు సీతాకళ్యాణం. ఈ సినిమాలో ఎప్పట్లాగే.. రాముడే హీరో. అయితే,చిత్రం ఏంటం టే.. మొత్తం సినిమాలో రావణాసురుడుకి ముళ్లపూడి వెంకట రమణగారు.. మొత్తంగా 30 పేజీల డైలాగులు రాశారు. (అంటే సినిమా మొత్తం అన్నమాట).. మరి దీనిని బట్టి హీరోగారికి ఎన్ని పేజీల డైలాగులు రాసి ఉండాలి. ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే.. కనీసం ఏ వంద పేజీలో రాయాలి అనుకుంటాం.
ఎందుకంటే.. విలన్ ని డామినేట్ చేయాలంటే..(దీనినే విపక్షం అనుకోండి) ఆ మాత్రం డైలాగులు పేల కపోతే ఎలా?!(ఇప్పుడు సిని మాలు ఇలానే ఉన్నాయ్ కదా?!) కానీ.. అప్పటి రాముడు, బాపు రాముడుకి.. ముళ్లపూడివారు రాసిన డైలాగులు `సింగిల్ పేజీ`(యదార్థంగా ఇంతే!! కావాలిస్తే.. ఒట్టు!!) దీంతో నాబోటి గాడికి డౌటొచ్చింది.. వెంటనే ముళ్లపూడివారిని కలిసి.. మహానుభావా.. హీరోను ఇంతగా ఇన్సల్ట్ చేస్తారా? డైలాగులన్నీ.. ప్రతిపక్షానికి ఇచ్చేస్తే.. అధికార పక్షం ఏం చేస్తుంది? సింగిల్ పేజీ డైలాగులతో మూడుగంటల పాటు ఎలా నెట్టుకొస్తాడు స్వామీ మా హీరో.. చెప్పు స్వామీ!! అని కన్నీరు పెట్టుకున్నంత పనిచేశాడట! వెంటనే స్పందించిన ముళ్లపూడి వారు తనదైన శైలిలో అద్భుతమైన `డైలాగ్` పేల్చారు.
అదేంటంటే.. ``వినవోయ్ గుర్నాథం.. ప్రతిపక్షంలో ఉన్నవారికే నయ్యా. మాటలు..! అధికార పక్షంలో ఉన్నవారివన్నీ చేతలే!!`` -అన్నార్ట! ఇది గుర్తుకొచ్చింది ఈ వేళ! నాలోనేనే రింగులు వేసుకుని ఓ రెండేళ్ల కిందకి వెళ్లాను.. అప్పుడు అధికారపక్షానికి పేజీలకు పేజీల డైలాగులు, గ్రాఫిక్కులూ ఉండేవని గుర్తు కొచ్చింది. వెంటనే స్పాట్కు వచ్చేస్తే.. ఇప్పుడు పేజీలకు పేజీలకు డైలాగులు లేవు.. గ్రాఫిక్కులు లేవు. గంటల తరబడి సమీక్షలు లేవు.. రెండు చేతుల నిండా పని మాత్రమే కనిపిస్తోంది.(అర్జనుడికి పిట్ట కన్ను కనిపించినట్టు) చేతి నిండా పని ఉన్నవాడికి నోటి నిండా మాటలు ఎందుకొస్తాయి?! ముళ్లపూడి వారికి జిందాబాద్!! ఇప్పుడు మనం చూస్తున్నది ముళ్లపూడి వారి అధికార పక్షాన్ని.. దీనికే ఇప్పుడు ఏడాది నిండింది. వడివడి గా దూసుకుపోతోంది!! అందుకే అనిపించింది.. కొన్నిసార్లు.. మనల్ని మనం గిల్లుకుని చూసుకోవాలి.. అని!!..
ఇట్లు..
గుంపులో గోవిందయ్య!!