ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనా పరంగా యేడాదిలోనే తిరుగులేని విధంగా దూసుకు పోతున్నారు. జగన్ ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లోనూ, ఆర్తిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా పాలన కొనసాగిస్తూ వస్తున్నారు. జగన్కు అన్నీ ఉన్నా.. పాలనలో దూకుడు ఉన్నా కూడా ఇప్పుడు ఓ లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్కు వచ్చిన 151 సీట్ల మెజార్టీని చూసిన వాళ్లు జగన్ జాగ్రత్తగా పాలన చేసుకుంటే మరో రెండు టర్మ్ లు సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు. అయితే జగన్కు వరుసగా కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
మరో వైపు ఇటు సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అంతెందుకు విశాఖలో డాక్టర్ సుధాకర్ విషయం చాలా చిన్నది.. అలాంటి డాక్టర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వరకు పరిస్థితి వచ్చింది అంటే అసలు జగన్కు ఎవరైనా ఈ విషయంలో సలహాలు ఇస్తున్నారా ? జగన్ చుట్టూ ఉన్న వాళ్లలో ఒక్కరు కూడా సమర్థులు లేరా ? అన్న సందేహం రాకమానదు. అయితే నాడు వైఎస్ కూడా పాలనలో దూకుడుగా ఉన్నా కూడా ఆయన కొందరి సలహాలు వినేవారు. ఎంత ఆవేశం ఉన్నా కూడా కొందరు చెప్పిన ఆలోచనలను ఆయన సావధానంగా వినేవారు. అలాంటి వారిలో మాజీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్కు అత్యంత సన్నిహితుడు అయిన కేవీపీ. రామచంద్రరావు, మరొకరు ఉండవల్లి అరుణ్ కుమార్.
వీరిద్దరి రాజకీయ చాణుక్యం ముందు ఎంతటి వారు అయినా తల వంచక తప్పని పరిస్థితి. రామోజీ రావు లాంటి మీడియా టైకూన్నే ఉండవల్లి ఎలా చెమటలు పట్టించారో చూశాం. ఇక కేవీపీ వ్యూహాలు ముందు నాటి సీనియర్లు సైతం వైఎస్కు తల వంచక తప్పని పరిస్థితి. ఇక ఇప్పుడు ఉన్న వాళ్లు జగన్పై ఎంత పిచ్చి ప్రేమ ఉన్నా సోషల్ మీడియాలో కోర్టులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో అది అంతిమంగా జగన్కే మైనస్ అవుతోంది. ఈ క్రమంలోనే నాటి వైఎస్ పాలనకు నేటి జగన్ పాలనకు భేరీజు వేస్తోన్న కొందరు వైఎస్ కుటుంబ అభిమానులు కేవీపీ, ఉండవల్లిని ప్రభుత్వ సలహాదారులుగా తీసుకు రావాలని సూచిస్తున్నారట. మరి జగన్ ఏం చేస్తాడో ?