జర్నలిస్టుల బతుకులు గాలిలో దీపాలు అన్న విషయం మనోజ్ మరణంతో మరోసారి రుజువైంది. కరోనా వేళ అందరూ ఇళ్లకు పరిమితమవుతున్నా...విధి నిర్వహణలో వైరస్ మహమ్మారికి ప్రాణాలను బలి ఇచ్చేశాడు. ప్రజలకు సమాచారం అందించాలనే తాపత్రయంలో..రిస్క్ జోన్లో కూడా కవరేజి ఇచ్చే ప్రయత్నం చేశాడు. కనీసం చావుకు..కడసారి చూపునకు కూడా కుటుంబ సభ్యులు నోచుకోలేక పోయారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిన తనయుడిని కడసారి చూసుకునే భాగ్యం లేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. భార్యబిడ్డలు గుండెలవిసెలా ఏడ్చారు. మనోజ్ మరణ వార్త జరల్నిస్టు లోకాన్ని తీవ్ర కలవర పాటుకు గురిచేస్తోంది.
రేపు మన పరిస్థితి ఇంతేనా..?! అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. అయితే వెట్టి చాకిరి చేయించుకుంటున్న మీడియా సంస్థలు కనీసం కంటి తుడుపు చర్యగా కూడా సాయం అందిచకుండా నిసిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మనోజ్ పనిచేసిన సదరు సంస్థ కూడా అదే పనిచేసింది. బాధలో ఉన్న మృతుడి కుటుంబానికి కనీస సాయాన్ని, సానుభూతిని ప్రకటించలేకపోయింది. సమాజాన్ని ఉద్దరించే నీతులు..ప్రవచనలతో...నిత్యం వార్తలను వడ్డీ వార్చే చానెళ్లు, పత్రికలు జర్నలిస్టుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నది నిర్వివాదాంశం. మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావ్...మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావ్..అన్న సామెతను గుర్తు చేస్తూ...ఎప్పుడూ తమకు కలిగి నష్టాల గురించే మాట్లాడుతాయ్...ఏకరువు పెడుతాయ్...
కేవలం మూడు నెలల కాలంలోనే ఆయా సంస్థల లాభాలు..సంపాదన తుడిచిపెట్టుకు పోయిన్నట్లుగా కటింగ్ ఇస్తున్నాయ్... తమ ఎదుగుదలకు కారణమైన ఉద్యోగులను,సిబ్బందిని తప్పించేస్తున్నాయ్.. లేదంటే జీతాల్లో భారీగా కోతలు విధించేస్తున్నాయ్. నిజంగా నిలదీయాల్సిన జర్నలిస్టు సంఘాలు కూడా మొసలి కన్నీరు కారుస్తున్నాయి. అయితే జర్నలిస్టులు మనోజ్ మరణంతోనైనా మేల్కోనాలి. వార్తల కవరేజ్ కోసమే కాదు..తమ కుటుంబాల కోసం కూడా ఆలోచించాలి. తమను నమ్ముకున్న తల్లిదండ్రులు, భార్య బిడ్డలు వారి భవిష్యత్ మదిలో పెట్టుకుని విధులకు బయల్దేరాలి. సేఫ్గా ఇంటికి చేరేలా జాగ్రత్తలు పాటించాలి.