ఏపీలో విపక్ష టీడీపీకి వరుస షాకుల పరంపరలో మరో అదిరిపోయే షాక్ తగలనుంది. ఇప్పటికే బాబోరి పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయారు. ముందుగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బాబు, చినబాబు లోకేష్పై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు సైతం వైసీపీకి దగ్గరయ్యారు. ఇక మూడో షాక్ గా ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సైతం వైసీపీకి చేరువ అయ్యారు. ఆయన అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఆయన తనయుడు వెంకటేష్ కు దగ్గరుండి మరీ వైసీపీ కండువా కప్పించేశారు. వీరిలో వంశీ, కరణం బలరాం చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన వారు కావడం విశేషం.
ఇక ఈ లిస్టులోనే పలువురు సీనియర్లు కూడా ఉన్నారు. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సైతం వైసీపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి చంద్రబాబు బాగా నమ్మిన నేత.. చంద్రబాబుకు రైట్ హ్యాండ్గా ఉంటూ వస్తోన్న ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వచ్చేశారు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీకి కొద్దో గొప్పు బెటర్ అనేలా నాలుగు సీట్లు వచ్చాయి. వీరిలో కరణం బలరాం ఇప్పటికే వైసీపీకి దగ్గరయ్యారు. ఇక మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు అయిన గొట్టిపాటి రవికుమార్, డోలా బాలా శ్రీ వీరాంజనేయ స్వామి, ఏలూరు సాంబశివరావు లు కూడా పార్టీ మారతారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక వీరి సంగతి ఇలా ఉండగానే ఇప్పుడు సిద్ధా రాఘవరావు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
వాస్తవానికి గత ఎన్నికల్లోనే చంద్రబాబు రాఘరావు కుటుంబంతో ఆటలు ఆడుకున్నారు. రాఘవరావు కుమారుడికి దర్శి అసెంబ్లీ సీటుతో పాటు ఆయన తండ్రి రాఘరావుకు ఒంగోలు ఎంపీ సీటు ఇస్తారని అనుకున్నారు. అయితే చివర్లో రాఘవరావును బలి చేసి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు. దీంతో ఆయన కోట్లు ఖర్చు పెట్టినా మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై ఘోరంగా ఓడిపోయారు. బాబు తమను ఘోరంగా మోసం చేశారని అప్పట్లో సిద్ధా ఫ్యామిలీ వాపోయింది. అప్పటి నుంచి ఆయన పార్టీ మారేందుకు వేచి చేస్తున్నారు. ఇక బుధవారం ఆయన తన కుమారుడు సిద్ధా సుధీర్బాబుతో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకోనున్నారట.