ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న వారు శత్రువులు అవుతున్నారు. ఈ రోజు వరకు మిత్రులుగా ఉన్న వారు రేపుటికి శత్రువులు అయిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు అయితే జగన్ను కలిశారో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి చెందిన అనుకుల మీడియాకు బాగా టార్గెట్ అవుతున్నారు. చిరంజీవికి ఈ మీడియా ఏకంగా కులాన్ని అంటకట్టి మరీ విమర్శలు చేస్తోంది. వాస్తవంగా చిరంజీవి సినిమా రంగ సమస్యలపై అటు తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు ఇటు ఏపీ సీఎం జగన్ను కూడా కలిసి మాట్లాడారు. ఈ విషయంలో బాలయ్య సినిమా వాళ్లంతా తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర కూర్చుని భూములు పంచుకునే ప్లాన్లో ఉన్నారని విమర్శించడం.. ఆ వెంటనే మెగా బ్రదర్ నాగబాబు బాలయ్యను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేయడం ఈ వివాదం పెద్దది అయ్యింది.
ఇక ఇప్పుడు చిరంజీవిని ఎప్పుడు అయితే తెలుగుదేశం వాళ్లు కులం పేరుతో విమర్శిస్తున్నారో అప్పటి నుంచి జనసేన గ్యాంగ్ అంతా పసుపు పార్టీ వారిని టార్గెట్ చేస్తున్నారు. నాగబాబు అయితే తెలుగుదేశం అనుకూల మీడియాపై సోషల్ మీడియాలో తీవ్రంగా రెచ్చిపోతున్నారు. మీలాంటి వారికి జగనే కరెక్ట్ అని జగన్కు పరోక్షంగా సపోర్ట్ కూడా చేశారు. ఇక ఏపీలో టీడీపీ చచ్చినా అధికారంలోకి రాదని తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. దీంతో ఒక వైపు నాగబాబు, అటు జనసేన కార్యకర్తలు కలిసి టీడీపీని ఆడేసుకుంటున్నారు. మిమ్మలను అణచాలన్నా.. తొక్కి పట్టి నార తీయాలన్నా జగనన్నే కరెక్ట్ అంటూ జనసేన కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు.
ఇక చిరు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఆయన సీఎంలను కలిసి సినిమా పరిశ్రమకు మంచి చేయాలని చూస్తే చిరునే టీడీపీ టార్గెట్ చేయడాన్ని జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు. 2014 ఎన్నికలకు ముందు జనసేన టీడీపీకి సపోర్ట్ చేసింది. వచ్చే ఎన్నికల్లో జగన్ను కొట్టలేం అని డిసైడ్ అయిన చంద్రబాబు మళ్లీ పవన్, బీజేపీతో కలవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ప్రస్తుత పరిణామాలు ఇలాగే సాగితే మళ్ళీ భవిష్యత్తులో కూడా బాబుతో పవన్ ఎటువంటి అవగాహనకు రాలేని విధంగా అగాధం ఏర్పడిపోతుంది. మొత్తానికి ఈ పరిణామాలు మాత్రం జగన్ పట్ల జనసైనికులను సానుకూలం చేయడం విశేషం.