ఉమ్మడి రాష్ట్రం సహా ఏపీలో రైతుల పాలిట ఏ ముఖ్యమంత్రి అయినా ఆపద్భాంధవుడిగా నిలిచారంటే.. అది ఒక్క వైఎస్ రాజశే ఖర రెడ్డి మాత్రమే అంటారు అన్నదాతలు. అసలు రైతులకు విద్యుత్తే అందని రోజుల్లో ఏకంగా ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ను అందించిన సీఎంగా వైఎస్ గుర్తింపు పొందారు. రైతుల మనసుల్లో స్థానం సంపాయించుకున్నారు. అదేసమయంలో పోలవరం సహా వెలిగొండ వంటి కీలక ప్రాజెక్టులకు రూపకల్పన ఆయన హయాంలోనే జరిగింది. ఇలా అనేక రూపాల్లో రైతులను ఆదుకు న్న వైఎస్.. వ్యవసాయ రంగంపై తనదైన ముద్ర వేశారు.
సదరు ముద్ర ఆయన దిగంతాలకు తరలిపోయినా.. రాష్ట్రం విడిపోయినా.. ఇప్పటికి చెక్కు చెదరలేదు. ఏ ఇద్దరు రైతులు తారసపడినా `నాటి రోజులు` గుర్తుకు చేసుకుంటారు. అయితే, ఇప్పుడు ఏపీలో పరిస్థితి మారింది. రైతులు ఇక, వైఎస్ను పలవరించడం, తలుచుకోవడం మానేసే పరిస్థితి వచ్చింది! దీనికి ప్రధాన కారణం.. ఆయన కుమారుడు, యువ సీఎం జగన్ అన్నదాతల విషయంలో తీసుకుంటున్న సంచలన నిర్ణయా లు, అమలు చేస్తున్న పథకాలు. అధికారంలోకి వచ్చీరావడంతోనే రైతులకు పెట్టుబడి సాయం కింద 13700 రూపాయలు వారి అకౌంట్లలో వేశారు. ఈ నిధులు ఎట్టి పరిస్థితిలో ఏవేవో వంకలు పెట్టి మినహాయించుకునేందుకు అవకాశం లేకుండా బ్యాంకులకు షరతు పెట్టారు.
అదే సమయంలో రైతు భరోసా కేంద్రాలను భారీగా ఏర్పాటు చేశారు. రైతులకు అవసరమైన అన్ని సదుపాయా లు, సలహాలు ఇక్కడ ఉచితంగా లభిస్తాయి. అదేసమయంలో కొనుగోలు కేంద్రాలను మరింత పటిష్టం చేశారు. ఇక, తాజాగా ఇప్పుడు రైతుల కోసం మరో ముందడుగు వేశారు సీఎం జగన్. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రైతులకు తొమ్మిది గంటలు పగటిపూట విద్యుత్ అందించే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతి నిచ్చింది.
ఇప్పటికే రైతులకు అందించే సబ్సిడీని గత ప్రభుత్వాలు ఇచ్చిన దానితో పోలీస్తే జగన్ సర్కార్ మూడు రెట్లు పెంచింది. 2015-16లో 3186 కోట్ల సబ్సిడీని ఇస్తే 2020-21లో ప్రభుత్వం దానిని 8354 కోట్లకు పెంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 18.37 లక్షల పంపుసెట్లకు గాను 12221 మిలియన్ వాట్ల విద్యుత్ అవసరాన్ని గుర్తించినట్లు విద్యుత్ శాఖ తెలిపింది. మరి ఇన్ని చేసిన తర్వాత వైఎస్ను మించిన నాయకుడిగా జగన్ నిలిచిన తర్వాత.. రైతుల మనసులో జగన్కే చోటు ఉంటుందనడంలో సందేహం ఏముంటుంది. రైతుల గుండెల్లో వైఎస్ రారాజుగా నిలిస్తే... జగన్ మహారాజుగా నిలిచిపోయేలా ముద్ర వేసుకుంటున్నాడు.