వైసీపీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యే కనుమూరి రాఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి వైసీపీలో కొందరికి నచ్చొచ్చు.. మరి కొందరికి నచ్చకపోయి ఉండవచ్చు. అయితే వాస్తవంగా చూస్తే వైసీపీలో సీఎం జగన్ చుట్టూ ఓ కోటరి ఉందన్న టాక్ అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే బలంగా వినిపిస్తోన్న మాట. జగన్ చుట్టూ ఉన్న ఈ కోటరీ కంచెను దాటి పార్టీలో గెలిచిన సగానికి పైగా ఎమ్మెల్యేలు జగన్ను కలవడం కుదరడం లేదని అంటున్నారు. జగన్ సీఎం అయ్యి యేడాది దాటుతోంది. ఇప్పటకీ ఓ 80 మంది ఎమ్మెల్యేలకు జగన్ను కలిసేందుకు టైం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని వాళ్లే చర్చించు కుంటున్నారు.
వాస్తవంగా చూస్తే గతేడాది వైసీపీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన 151 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 80 మంది వరకు కొత్త వారే ఉన్నారు. వీరంతా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సమాజానికి, ప్రజలకు ఏదో మంచి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలుగా గెలిచి యేడాది అవుతున్నా కూడా వీరు తమ నియోజకవర్గాల్లో ఏ ఒక్క పని చేపట్టలేదు. ఏదో చేయాలన్న తాపత్రయంతో ఉన్నారు. అయితే వీరు సీఎం జగన్ను కలిసే అవకాశం లేకపోవడంతో తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. జిల్లాలకు పార్టీ ఇన్చార్జ్లుగా ఉన్న వారికి కూడా అనేక పనులు ఉండడంతో వీరిలో ఒకరిద్దరు మినహా ఎమ్మెల్యేలను పట్టించుకునే పరిస్థితి లేదు.
ఇక రఘురామకృష్ణం రాజుకు కూడా జగన్ను కలిసేందుకు ప్రయత్నించగా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఆయన అస్సలు ఆగలేకపోయారు. ఉన్న మాటను తెలుగుదేశం అనుకూల మీడియాలో కుండబద్దలు కొట్టేశారు. దీంతో మంత్రి పదవి రేసులో ఉన్న ప్రసాదరాజు సహజంగానే రఘు వ్యాఖ్యలను కౌంటర్ చేశారు. వీటిని మళ్లీ కౌంటర్ చేస్తూ రఘు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జగన్ చుట్టూ ఉన్న కోటరీని టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఏ సామాజిక వర్గానికైతే ఎక్కువ పదవులు దక్కుతున్నాయో.. ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు, కోటరీగా ఏర్పడి ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
రఘు చేసిన వ్యాఖ్యల్లో పరోక్షంగా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినట్టు ఉంది. రఘు పార్టీ లైన్కు వ్యతిరేకంగా వెళుతున్నారన్న విషయాన్ని ఇక్కడ పక్కన పెట్టలేకపోయినా ఆయన మాట్లాడిన మాటల్లో నిజం ఉందనేది వైసీపీ ఎమ్మెల్యేలే చెపుతున్నారు. ఆ చుట్టూ ఉన్న కోటరీ జగన్ను కలిసే విషయంలో జూనియర్లను ఖేర్ చేయకుండా అపాయింట్ మెంట్ లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే వీళ్ల వల్లే పార్టీ ఎమ్మెల్యేల్లో జగన్పై చివరకు అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది. వీరు తమ బాధ పైకి చెప్పుకోకపోయినా లోలోన రగిలిపోతున్నారు.