రాజకీయాల్లో ఏపీ రాజకీయాల రూటే సపరేటు.. అందులోనూ వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఇంకా సపరేటు. జగన్ దగ్గర ఎంత పెద్ద నేత అయినా బతిమిలాడడాలు.. బుజ్జగించడాలు ఉండవు. మహా అయితే ఒకటి రెండు సార్లు మాత్రమే ప్రేమతో చెపుతాడు. ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారు. జగన్ ఎంత మొండి నేతో మనం అందరం చూశాం. ఎప్పుడో 2009లో తండ్రి చాటు బిడ్డగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన జగన్ కడప ఎంపీగా గెలిచారు. ఆ అనుభవం కూడా జగన్కు కేవలం మూడు నెలలకే పరిమితం అయ్యింది. ఆ వెంటనే వైఎస్ మృతి.. కాంగ్రెస్తో విబేధాలు.. కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు రావడం.. కడప ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం.. ఆ టైంలోనే తన తల్లి విజయమ్మను పులివెందుల ఉప ఎన్నికల్లో కూడా గెలిపించుకున్నారు.
ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం... జైలుకు వెళ్లడం.. జైలు నుంచే ఉప ఎన్నికలకు వెళ్లడం.. ఆ ఎన్నికల్లో కనీ విని ఎరుగని రీతిలో 15 స్థానాలు గెలుచుకోవడం.. వరుస ఉప ఎన్నికల్లో విజయాలు... ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాలు ఇలా ప్రతీది ఓ సంచలనం అయ్యింది. 2014 ఎన్నికలకు ముందు సుదీర్ఘంగా ఓదార్పు యాత్ర చేసిన జగన్ ఆ ఎన్నికల్లో ఓడిపోయినా ఏకంగా 67 సీట్లు తెచ్చుకున్నారు. ఇక ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న జగన్ నిత్యం ప్రజల్లోనూ ఉంటూ రాజకీయంగా 2019 ఎన్నికల్లో సరికొత్త సంచలనమే క్రియేట్ చేశారు. అటు వైపు చంద్రబాబు లాంటి నేత ఉన్నా జగన్ దేనికి భయపడడం లేదు... ఎలాంటి మొహమాటాలు లేవు.
ఎవరైనా సరే తుక్కు రేగొట్టేస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు అయినా కనీసం బయట ఎదురు పడినప్పుడు అయినా పలకరింపులు, మర్యాదలు ఉంటాయి. జగన్ మాత్రం చంద్రబాబుతో ఇంటా బయటా కూడా రాజీ లేకుండా పేచీయే తప్ప రాజీ లేదంటున్నారు. గత సర్కార్ అవినీతిని లాగి పారేసి జనంలో బాబును, అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్లను బోనులో దోషులుగా నిలబెట్టే వరకు నిద్రపోయే పరిస్థితి లేదంటున్నారు. ఏ విషయంలో అయినా ప్రతిపక్షం పేరు చెపితే యాక్షన్కే రెడీ అంటున్నారు.