టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుతో మొదలైన టీడీపీ నాయకుల వరుస అరెస్టుల పర్వంతో ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారికి ఉలిక్కిపడింది. వారి అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు టీడీపీ శ్రేణులు. అధినేత చంద్రబాబు నుంచి పార్టీ ఎమ్మెల్యేల వరకు అందరూ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ కక్షపూరిత రాజకీయాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. అయితే టీడీపీకి కానీ, టీడీపీ నేతలకు కానీ ఏదైనా జరిగితే.. వెంటనే స్పందించే కొందరు మీడియా పెద్దలు, మేధావులు కూడా కొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలపై మౌనం వహించారు. దీనికి కారణమేంటి..? ఎందుకు మౌనంగా ఉన్నార..? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఒకసారి విశాఖపట్నం ఎయిర్ పోర్టులో పోలీసులు టీడీపీ అధినేత చంద్రబాబుని అడ్డుకోవడం జరిగింది. ఈ వ్యవహారం లో ప్రభుత్వ వైఖరిని మేధావులు, మీడియా పెద్దలు ఖండించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు చంద్రబాబు అమరావతి పర్యటన చేశారు. అయితే ఈ పర్యటనని అమరావతి రైతులు అడ్డుకున్నారు, చంద్రబాబుకి వ్యతిరేఖంగా నిరసనలు తెలియజేశారు. అయితే దీంట్లో కూడా ప్రభుత్వాన్నే తప్పుపట్టారు కొందరు మేధావులు, మీడియా పెద్దలు. మరి అలాంటి మేధావులు ఇప్పుడు ఎక్కడ..?
టీడీపీని సమర్ధించే నాయకులు ఉన్నారే తప్ప.. మేధావులు ఎక్కడా కనిపించడం లేదు... టీడీపీ నేతల అరెస్టులను మేధావులు ఎక్కడా ఖండించలేదు. దీనికి కారణం ఏంటి..? కేవలం రాజకీయ కారణాలు చూపుతూ.. చంద్రబాబు ఆయన బృందాలు రోడ్డెక్కాయి. కానీ, మేధావులు మాత్రం ఎక్కడా పెదవి విప్పలేదు. దీనిని బట్టి అధికారులు ఏయే అంశాలను ప్రస్థావిస్తూ వారిని అరెస్టు చేశారో.. అవి నిజమేననే భావన కలుగుతుంది. అరెస్టు చేసే విధానంలో కఠినత్వం కనిపించొచ్చు... కానీ, అసలు కేసుల వెనుక ఉన్న కారణం విషయంలో మాత్రం తేడా లేదనేది మాత్రం అర్దమవుతుంది. అందుకే మేధావులు మౌనం పాటించారేమో అనే సందేహం ఇప్పుడు తెరమీదికి వచ్చింది.