రాజకీయాల్లో ఏ నేతకైనా ఉండకూడనిది ఆవేశం.. ఉండాల్సింది ఆలోచన! ఈ రెండింటి మధ్య తేడా గుర్తించకపోతే.. ఎంతటి నేత కైనా ఇబ్బంది కొని తెచ్చుకున్నట్టే! ఈ సున్నిత అంశాన్ని పట్టించుకుని ఫాలో అయిన వారు తమ కెరీర్లో ముందుకు దూసుకు పోతే.. పట్టించుకోకుండా గంతులు పెట్టిన వారి పరిస్థితి ఏమైందో కర్నూలు మాజీ ఎంపీ.. పార్టీ మారిన.. చిందులు తొక్కిన వారి పరిస్థితి కళ్లముందు కనిపిస్తూనే ఉందనే విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. తాజాగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయం వైసీపీలో అట్టుడుకుతోంది. రోజుకో విధంగా ఆయన నోరు పారేసుకోవడాన్ని పార్టీ అదినేత, సీఎం వైఎస్ జగన సీరియస్గానే పరిగణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
పైకిఏమీ మాట్లాడక పోయినా.. అంతర్గతంగా ఎంపీ విషయంపై చర్చ రగులుతోంది. ఈ క్రమంలోనే పార్టీ తాజాగా చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. పార్టీ అనేది లేకుండా అందరూ గడ్డి పరకలేనని.. ఈ వివాదంతో సబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ చురకలం టించింది. ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని, హద్దు మీరితే ఎలాంటి చర్యలకైన వెనకాడమని జగన్ చెప్పినట్లు తాజా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. నాయకులు ఒకరిపై మరొకరు సవాల్ విసురుకోవడం మానుకోవాలని హితవు పలికారు.
నరసాపురంలో జరిగిన సంఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తప్పెవరిది అనే దానిపై అధిష్టానం నివేదిక తెప్పించుకుంటుందన్నారు. ఈ పరిణామంతో.. సదరు ఘటనపై అధిష్టానం తొలి కొరడా ఝళిపిం చినట్టయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వాస్తవానికి సీఎం జగన్ తొలి షాట్లోనే సమస్య పరిష్కరిం చేందుకు ప్రయత్నిస్తారు. గతంలోనూ అనేక వివాదాలు తెరమీదికి వచ్చినప్పుడు.. తొలి ప్రయత్నంలోనే జగన్ పరిష్కరించే ప్రయత్నం చేశారు. అప్పటికీ వినకపోతే.. రెండో ప్రయత్న ఉండదు.. ఫైనల్గా ఆయన చేయాల్సింది చేసేస్తారు.
మొత్తంగా ఇప్పుడు జగన్ ఇచ్చిన ఆదేశాలు బాగానే పనిచేస్తున్నాయని అంటున్నారు. అయితే, ఎంపీ దూకుడు వెనుక అసలు ఏంజరిగింది? ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది.? అనే విషయాలపై దృష్టి పెట్టడం మరో ఆసక్తికర పరిణామం. ఆది నుంచి కూడా ఎంపీ రఘు వ్యవహారం పార్టీలో కీలక చర్చగా మారింది. పార్టీలో గెలిచిన నాయకులు.. పార్టీని వీడి సాము చేయడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో.. తన నియోజకవర్గంలోనే ఆయనకు కనిపిస్తున్న పరిణామం. అయినాకూడా తనంతటి వాడు లేరనే ధోరణిని ప్రదర్శించడం వల్లే ఇప్పుడు వివాదానికి కారణమయ్యారు. ఇప్పటికైనా సంయమనం పాటిస్తేనే బెటర్ అంటున్నారు పార్టీ సీనియర్లు..!