టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో గట్టి షాక్ తగలబోతుంది. టీడీపీకి మరో కీలక ఎమ్మెల్యే గుడ్ బై చెప్పబోతునట్టు తెలుస్తుంది. పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆ ఎమ్మెల్యే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఈ విషయమై చంద్రబాబుకి ఆ ఎమ్మెల్యే ఒక హింట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఆ కీలక ఎమ్మెల్యే ఎవరు..? వారి అసంతృప్తికి గల కారణమేంటి..? వారు ఇచ్చిన హింట్ ఏంటి..? పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 173 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏసీబీ కేసులో అరెస్టైన అచ్చెన్నాయుడు, మరోవైపు హోమ్ క్వారంటైన్లో ఉన్న అనగాని సత్యప్రసాద్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. పోలైన ఓట్లను మొత్తంగా చూసుకుంటే వైసీపీకి మొత్తం 151 ఓట్లు పడగా, టీడీపీకి మాత్రం 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్ధులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ ఘన విజయం.. టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య పరాజయం ఒకే సారి జరిగిపోయింది.
అయితే ఈ క్రమంలో టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ ఓటు చెల్లకుండా టీడీపీ అభ్యర్థికే ఓటేశారు. విప్ ఇవ్వడంతో ఓటింగ్లో పాల్గొనడంతో పాటు ఎవరికి ఓట్ వేశారో ఏజెంట్ కు చూపించడం తప్పని సరి. దీంతో టీడీపీకే ఓటు వేసినా అది చెల్లని విధంగా ఒకటి అని పెట్టాల్సిన మొదటి ప్రాధాన్యతా స్థానంలో ఎమ్మెల్యేలు టిక్మార్క్ పెట్టారు. దీంతో ఈ ఓట్లు చెల్లకుండా పోయాయి. అలాగే అవగాహనా లోపం వల్ల రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మొదటి ప్రాధాన్యత స్థానంలో 1 అని పెట్టాల్సిన చోట టిక్ మార్క్ పెట్టారు. దీంతో ఈ ఓటు చెల్లకుండా పోయింది. అయితే ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కొద్ది రోజులుగా ఆమె టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉందని.. దీంతో ఆమె కావాలనే ఇలా చేశారని టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. తన బాబాయ్ అచ్చెన్నాయుడిని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం వెనుక లోకేష్ బాబు ఉన్నాడని, అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అతడి చేత ఈఎస్ఐ స్కామ్ చేయించకపోయినట్లైతే ఈరోజు తమ బాబాయ్ కేసులను ఎదుర్కొనేవాడు కాదని, చంద్రబాబు అతడి కొడుకు లోకేష్ నిర్వాకం వలనే ఈరోజు తమ కుటుంబం కేసులు ఎదుర్కోవలసి వస్తుందని అక్కసుతో చెల్లని ఓటుగా వేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఎర్రన్నాయుడు వారసురాలిగా పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తనకి ప్రస్తుతం టీడీపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం వంటి కారణాల నేపధ్యంలో ఆమె త్వరలోనే టీడీపీకి గుడ్ బై చేప్పేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి టీడీపీ వీడిన అనంతరం ఆమె ఏ పార్టీలో చేరుతారో అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.