దేశంలో ప్రధానంగా రెండు కీలక విషయాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకటి చైనా అయితే.. రెండు ప్రధానిగా నరేంద్ర మోడీ..! ఈ దేశ సార్వభౌమత్వానికి కట్టుబడి ఉంటామంటూ.. నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. 56 అంగుళాల ఛాతీ.. ఈ దేశానికి రక్షణ ఛత్రంగా ఉంటుందని పదే పదే కమల నాథులు సైతం చెప్పుకొంటారు. కానీ, ఇప్పుడు జరుగుతోంది ఏంటి? దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఊపందు కుంటున్నాయే తప్ప.. విదేశాంగ వ్యవహారాల్లో మాత్రం మోడీ పూర్తిగా సక్సెస్ కాలేక పోతున్నారని అంటు న్నారు పరిశీలకులు.
చైనాతో సంబంధాలు మెరుగు పడుతున్నాయని, విదేశాంగ వ్యవహారాల్లో భారత్ అన్ని విధాలా ఆచితూచి వ్యవహరిస్తోందని ప్రధాని మోడీ ఆరు మాసాల కిందట చెప్పుకొచ్చారు. చైనా అధినేత జిన్పింగ్ భారత్ కు వచ్చినప్పడు.. దేశమంతా తిప్పి.. ఆయనతో చర్చలు కూడా జరిపారు. ఇంత చేసినా.. ఇప్పుడు కరోనా నేపథ్యంలో భారత్.. అమెరికాతో కలిసి తమపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చైనా వ్యూహాత్మకంగా వ్య వహరించి.. ప్రపంచ దేశాల దృష్టిని మరల్చేందుకు ఇలా భారత్పై దాడులకు తెగబడుతోంది. అయితే, ఈ విషయంలో అడ్డుకునేందుకు లేదా కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీనే చెప్పినట్టు.. ఆరు వారాలుగా జరుగుతున్న ఈ సంకట పరిస్థితిని ఎదుర్కొనేందుకు మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం.. జాతి క్షమించే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు.
విదేశాంగ విధానంలో మోడీ అనుసరిస్తున్న తీరు ఆది నుంచి కూడా వివాదంగానే ఉంది. పాకిస్థాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేశామని మోడీ చేసుకున్న ప్రచారాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. అదే సమయంలో పాక్ దూకుడును ఎదిరించడంలోనూ మోడీ సర్కారు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లలేక పోయింది. ప్రపంచ స్థాయిలో పాక్ను ఒంటరిని చేశామని చెబుతున్న మోడీ.. అదే పాక్.. చైనాతో కలిసి.. మన భూభాగానికి అత్యంత సమీపంలో నిర్మిస్తున్న ఆర్ధిక కారిడార్ను నిలువరించడంలో విఫలమయ్యారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చూపిస్తున్న శ్రద్ధ.. విదేశాల్లో భారత్ పరువును కాపాడలేక పోతున్నారనే వాదన నుంచి మోడీ బయటకు రాలేక పోతున్నారు.
నేపాల్ నిన్న మొన్నటి వరకు భారత్ విషయంలో చాలా ఆమోదయోగ్యమైన రీతిలో వ్యవహరించింది. కానీ, ఇప్పుడు చైనా ప్రభావానికి లోనైందనే వాదన ఉంది. అదేసమయంలో పాకిస్థాన్ కూడా! ఇలా అనుకూల దేశమైన నేపాల్ను, దాయాది దేశమైన పాక్ను చైనా ఆడిస్తున్నప్పటికీ.. మోడీ సర్కారు నిలువరించే ప్రయత్నం చేయకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఇదే విధానం అనుసరిస్తే.. మున్ముందు.. మరింతగా భారత్ పరువు పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. సమర శీలత అంటే.. ఇంట్లో వాళ్లను కొట్టడం కాదు! పొరుగువారిని కట్టడి చేస్తేనే కదా! తెలిసేది!!