ఏపీలో అధికార వైసీపీలో అసంతృప్తి రగులుతోందా ? సీఎం జగన్పై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారా ? అంటే తాజా పరిణామాలు అవునన్న సందేహాలు సొంత పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 80 మందికి పైగా ఎమ్మెల్యేలు సీఎం జగన్, ఆయన చుట్టూ ఉన్న కోటరీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది నమ్మశక్యంగా ఉన్నట్టు అనిపించకపోయినా ఇటీవల జరిగిన పరిణామాలు కూడా ఇవి నమ్మక తప్పదన్న సంకేతాలు బలపరుస్తున్నాయి.
ఇటీవల నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజునే తీసుకుంటే ఆయన ఏకంగా సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదని చెప్పడంతో పాటు కొందరు మంత్రులు ,ఎమ్మెల్యేలనే టార్గెట్ గా చేసుకుని నేరుగానే విమర్శలు చేశారు. ఇక ఇటీవల కాలంలో మాజీ మంత్రి ఆనం రాయ నారాయణ రెడ్డి నుంచి మొదలు పెడితే 10 మంది ఎమ్మెల్యేలు.. చివరకు రోజాతో సహా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఓపెన్గానే విమర్శలు చేశారు. ఇక 80 మంది ఎమ్మెల్యేలకు జగన్ యేడాది కాలంలో అపాయింట్ మెంటే ఇవ్వలేదని తెలుస్తోంది.
తొలి ఏడాదిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకంగా వివిధ సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లోకి నేరుగా 40 వేల కోట్ల రూపాయలుపైగా జమ చేశారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఏమాత్రం అందకపోవటం ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జగన్ ఎన్ని అప్పులు తెచ్చినా అవన్నీ సంక్షేమ పథకాలకే పప్పు బెల్లాల్లా పం చేస్తున్నారు. ఇక నియోజకవర్గాల అభివృద్ధి కోసం అంటూ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ఇచ్చే నిధులే లేవు. దీంతో ప్రజల నుంచి, పార్టీ నేతల నుంచి వస్తోన్న అనేక ప్రతిపాదనల్లో కనీసం కొన్ని కూడా చేయలేని దుస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు.
అటు తమ బాధలు చెప్పుకునే అవకాశం సీఎం ఇవ్వకపోవడం... తమ పనులు ఏ మాత్రం ముందుకు సాగకపోవటంతో చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని..వాళ్ళంతా కూడా బయటపడి మాట్లాడితే పార్టీకి చిక్కులు తప్పవని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక జగన్ చుట్టూ ఉన్న కోటరీ కూడా కొందరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా చేస్తోందట. మరి ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ వీటిని ఎలా సరి చేసుకుంటాడో ? చూడాలి.