రాజకీయాల్లో తండ్రి, తనయులు రాణించిన సందర్భాలు తక్కువ ఉంటాయి. తండ్రి రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేస్తే తండ్రి పేరును నిలబెడుతూ కొడుకు కూడా తండ్రి పేరుకు ఎక్కడా తగ్గకుండా రాణించడం కూడా గొప్ప విషయమే. ఉదాహరణకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డిని మించిన తనయుడే అని చెప్పాలి. వైఎస్ సీఎం అయ్యేందుకు దశాబ్దాలు వెయిట్ చేశారు. జగన్ పార్టీ పెట్టిన ఆరేడేళ్లకే సీఎం అయ్యారు. ఇక ఇప్పుడు ఇదే కోవలోకి వస్తారు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథర్. దివంగత మాజీ మంత్రి, కాకలు తీరిన రాజకీయ యోధుడు కోటగిరి విద్యాధరరావు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన కోటగిరి శ్రీథర్ యువ ఎంపీగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటూ పశ్చిమ రాజకీయాల్లో దూసుకు పోతున్నారు.
శ్రీథర్ తండ్రి విద్యాధరరావు ఐదుసార్లు చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన మరణాంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన శ్రీథర్ ఎంపీగా పోటీ చేసి తొలి ప్రయత్నంలో ఘనవిజయం సాధించారు. మాజీ మంత్రి మాగంటి బాబుపై ఏకంగా 1.65 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించి లోక్సభలోకి అడుగు పెట్టారు. విద్యాధరరావు ఎన్నో అభివృద్ది పనులు చేయడంతో పాటు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ వర్గం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. నాడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు సైతం ఎన్నో సంక్లిష్టమైన ఆపరేషన్లు ఆయనకు అప్పగించే వారు. అపర చాణుక్యుడిగా పేరున్న ఆయన ఎలాంటి సమస్యను అయినా ఇట్టే పరిష్కరించే వారు.
ఆయన బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన శ్రీథర్ ఎన్నికలకు యేడాదిన్నర ముందు నుంచే ఏలూరు లోక్సభ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలకు చేరువ అయ్యారు. విద్యాధరరావు గారి కుమారుడు అని ప్రజలు శ్రీథర్కు ఎక్కడికక్కడ బ్రహ్మరథం పట్టారు. అన్నింటికి మించి ఈ తరం దుందుడుకు రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన నిత్యం ప్రజలకు ఏదైనా చేయాలన్న తపనతో ఉంటారు. ఎంపీగా గతంలో సీనియర్లు, మంత్రులు, మహామహులు ఏలూరు నుంచి ఎన్నికైనా వాళ్లు ఏనాడు సామాన్యుల వద్దకు వెళ్లలేదు. శ్రీథర్ ఓ సామాన్యుడిగా అందరిలోనూ కలిసిపోయారు.
ఇక ఎంపీగా గెలిచాక శ్రీథర్ తన లోక్సభ నియోజకవర్గంలోని ఒక్కో సమస్యను పరిష్కరించు కుంటూ ముందుకు వెళుతున్నారు. చిన్నపాటి ఆరోపణలు కూడా ఆయనపై ఇప్పటి వరకు లేవు. సామాన్యుల నుంచి నిరుపేదల వరకు ఎవరు అయినా సరై సమస్య పరిష్కరించాలని ఆయన గడప తొక్కితే చాలు వెంటనే ఆ సమస్యపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పరిష్కరిస్తున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యలతో పాటు జాతీయ స్థాయిలో అపరిష్కృతంగా ఉన్న వెంట్రుకల ఎగుమతుల అంశాన్ని సైతం ఆయన లోక్సభలో ప్రస్తావించి జాతీయ స్థాయిలో హైలెట్ అయ్యారు. ఏదేమైనా తండ్రికి తగ్గ తనయుడిగా శ్రీథర్ పశ్చిమ రాజకీయాల్లోనూ, తెలుగు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారనడంలో సందేహం లేదు.