కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైన చైనాను ప్రపంచ దేశాలు తూర్పార పడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల దృష్టి మళ్లించేందుకు భారత్పై యుద్ధ ప్రయోగాలకు చైనా సిద్ధమవుతోంది. భారత్తో కావాలనే సరిహద్దు వద్ద యుద్ధన్మోదంతో వ్యవహరిస్తోంది. ఓ వైపు శాంతి ప్రవచనలు వల్లిస్తూనే మరో వైపు సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చైనా వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా తిరస్కరణకు గురవుతున్న వేళ..సూపర్ పవర్ అభివృద్ధికి బీటలు బారుతున్నాయి. ఆ అవకాశం భారత్కు దక్కకుండా చేయాలన్నదే చైనా అసలు వ్యూహం. తాను గెలకడంతో పాటు భారత్ మిత్ర దేశాలను శత్రు దేశాలుగా మార్చేందుకు వేగంగా కుట్రలు పన్నుతోంది.
చైనా వ్యూహంలో భాగంగానే భారత్కు చిరకాల మిత్ర దేశమైన బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటున్న దాదాపు 5,161 రకాల ఉత్పత్తులపై 97 శాతం సుంకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొద్ది రోజుల క్రితమే నేపాల్ దేశానికి భారత్కు సత్సంబంధాలు చెడేలా చేయడంలో చైనా విజయం సాధించిందనే చెప్పాలి. అయితే అక్కడి ప్రజలు కూడా చైనా కుట్రలు గమనించడంతో ఇప్పుడు చైనాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంపై నేపాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాక చైనా నుంచి లక్షల కోట్ల నగదుయే నేపాల్లో రాజకీయం రంగు మారడానికి అసలు కారణంగా తెలుస్తోంది. నేపాల్ను బుట్టలో వేసుకున్న చైనా పాకిస్తాన్, శ్రీలంక, ఇప్పుడు బంగ్లాదేశ్లపై దృష్టి సారిస్తోందనే చెప్పాలి.
వాస్తవానికి ఇందులో పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఎప్పటి నుంచో భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూనే ఉన్నాయి. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించేలా శ్రీలంకలో పోర్టుల నిర్మాణానికి విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పాకిస్థాన్కు రుణాలు ఇస్తూనే ఉంది. పాకిస్థాన్ చెల్లించలేదని తెలిసినా చైనా ఇవ్వడంలో ఆంతర్యం శత్రు దేశానికి ఎగదోసేందుకేనని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా నేపాల్, బంగ్లాదేశ్లను తన వైపు తిప్పుకునేందుకు చైనా శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోందని చెప్పాలి. అయితే బంగ్లాదేశ్ అంత ఈజీగా చైనా బుట్టలో పడదన్నది విశ్లేషకుల అంచనా. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ కృషి వెలకట్టలేనిది. అది గుర్తుంచుకుంటే చాలు బంగ్లాదేశ్ అంటూ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.