ఆయన టీడీపీలో మాజీ మంత్రి. కృష్ణాజిల్లాకు చెందిన బీసీ నేత. ఇటీవల కాలంలో ఆయన సైలెంట్గా ఉన్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇటీవల కాలంలో మీరు సైలెంట్గా ఉంటున్నారు. ఏదైనా ప్లాన్ ఉందా? అని ప్రశ్నించారు. దీంతో ఖంగుతిన్న ఆయన వెంటనే సమయం సందర్భం ఉందో లేదో కూడా చూసుకోకుండా.. అందరూ మరిచిపోయిన విషయాన్ని తెరమీదికి తెచ్చి.. ఒకరోజు నిరసన వ్యక్తం చేశారు. అదికూడా ఆయన పుట్టిన రోజు నాడే చేయడంతో పెద్ద ఎత్తున బూమ్ వస్తుందని సదరు మాజీ మంత్రి వర్యులు ఆశించారు. కానీ, ఆయనకు ప్రజల్లో మాట పక్కన పెడితే.. పార్టీలోనూ బూమ్ పెరగకపోవడం గమనార్హ0.
ఇంతకీ ఆయన ఎవరంటే.. మాజీ మంత్రి, మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓడిన యువ నాయకుడు కొల్లు రవీంద్ర కుమార్. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన జీ ప్లస్ 3 ఇళ్లు పేదలకు కేటాయించాలంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం తన పుట్టిన రోజు నాడే మచిలీపట్నంలో నిరాహార దీక్ష చేప ట్టారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 7 లక్షల వెయ్యి జీ ప్లస్ 3 ఇళ్లు మంజూర య్యా యని, వాటిలో 3 లక్షల 9 వేల ఇళ్లు పూర్తయ్యాయన్నారు. కృష్ణాజిల్లాకు 96వేల ఇళ్లు మంజూరు కాగా 31 వేలు పూర్తయ్యాయన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 4130 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
లాటరీ వేసి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ వీరెవరికీ జీ ప్లస్ 3 ఇళ్లను స్వాధీనం చేయలేదన్నారు. నిర్మాణం పూర్తయిన వాటిని కేటా యించడానికి వచ్చిన సమస్య ఏంటని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి ఈ విషయంపై ప్రబుత్వం ఇంతకు ముందుగానే వివరణ ఇచ్చింది. ఈ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఖర్చును పూర్తిగా చెల్లించకుండానే గత ప్రభుత్వం పెండింగులో పెట్టిందని వివరించింది.
అయితే, ఈ విషయాన్ని మాజీ మంత్రి కొల్లు ప్రస్థావించకుండా.. ఏదో గుర్తింపు కోసం .. ఒక రోజు దీక్షకు కూర్చున్నారు. అయితే, ఆయన ఆశించినట్టుగా ఇటు నియోజకవర్గంలోనూ, అటు పార్టీలోనూ పెద్దగా గుర్తింపు లభించకపోవడం గమనార్హం. దీంతో మాజీ మంత్రి ప్రయాస వృథా అయిందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.