కయ్యానికి కాలు దువ్వుతూ అన్యాయంగా భారత సైనికుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న చైనా ఆర్మీకి గట్టి బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోంది. వాస్తవానికి దేశ ప్రజలందరి ఆకాంక్ష కూడా అది. గతంలో పాకిస్థాన్ ఇదే రీతిన సైన్యంపై దాడి చేసిన సమయంలో సర్జికల్ స్ట్రైక్స్తో తిరుగులేని సమాధానం చెప్పింది. దీంతో నాటి నుంచి నేటి వరకు కూడా పాకిస్థాన్ తోక జాడించకుండా కిమ్మని ఉంటోంది. అయితే ఇప్పుడు అనేక అంతర్జాతీయ పరిణామాలను బేరీజు వేసుకుని భారత్ను దెబ్బకొట్టేందుకు డ్రాగన్ కంట్రీ సరిహద్దు రేఖ వెంబడి కయ్యానికి కాలు దువ్వుతోంది.
ఈ క్రమంలోనేజూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెసిలిందే. ఈ ఘటనలో కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. . చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే చైనా మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. అయితే సరిహద్దు వెంబడి చైనా ఆగడాలను నియత్రించేందుకు భారత ఆర్మీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా దాడులను తిప్పికొట్టాలని, వారి ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు.
సరిహద్దు వద్ద చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత ఆర్మీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను కల్పించింది. ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి..శత్రు దేశాన్ని ఎదుర్కొవడానికి అనుసరించాల్సిన మార్గాలపై, నిర్ణయాధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసిందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. గాల్వాన్ లోయలో భారత, చైనా ఘర్షణాత్మక వైఖరి నేపథ్యంలో ఆర్మీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తూర్పు లద్దాఖ్లో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ చర్యలన్నీ కూడా మరోసారి చైనా దాడి చేయకుండా ఉండటంతో పాటు సరిహద్దు దాటి వచ్చే సైన్యాన్ని మట్టుబెట్టేందుకే అనడంలో ఎలాంటి సందేహం లేదు.