పతితులార.. భ్రష్టులార.. బాధాసర్పదష్టులార
ఏడవకండేడవకండి.. వస్తున్నాయొస్తున్నాయ్..
జగన్నాథ.. జగన్నాథ.. జగన్నాథ రథచెక్రాలొస్తున్నాయ్!!``
.. అయితే, ఈ సారి చరిత్రలో లేని విధంగా.. జగన్నాథ రథచక్రాలకు కూడా కరోనా సోకింది! ప్రపంచాన్ని తన కనిపించని విశ్వరూపంతో అల్లాడిస్తున్న వైరస్.. ఈ దఫా.. ప్రపంచ రథయాత్రగా చరిత్ర పుటల్లో కొన్ని శతాబ్దాలుగా చోటు దక్కించుకున్న అపురూపమైన వేడుకను కూడా కబళించింది. ప్రతి ఏటా ఆషాడ మాసంలో శుద్ధ విదియ పుణ్యతిధి నాడు అత్యంత అంగరంగ వైభవంగా ఒడిసాలోని పూరి పట్టణంలో సాగే జగన్నాథ రథ యాత్రకు కరోనా బ్రేకులు వేసింది. ప్రతిఏటా జరిగే ఈ యాత్రకు ప్రపంచంలోనే అతి పెద్ద వేడుకగా రికార్డు ఉంది. బలభద్రుడు, జగన్నాడు, రుక్మిణీ సమేతంగా భారీ రథాలపై ఊరేగి.. ఒక ఊరిలో విడిది చేసి తిరిగి ఆలయానికి చేరుకునే ఈ వేడుకకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పేరుంది.
ఎక్కడెక్కడి నుంచో ప్రజలు లక్షల కొద్దీ తరలి వస్తారు. స్థానికులైతే.. దీనిని ఒక సంక్రాంతి పండుగ మాది రిగా వారం రోజులు ముందుగా.. వారం రోజులు తర్వాతకూడా ఘనంగా నిర్వహించుకుంటారు. ఇంటిల్లి పాదీ కొత్తబట్టలు కుట్టించుకుని వేడుక చేసుకుంటారు. ప్రతి ఇంటా తోరణాలు భాసిల్లుతాయి. అలాంటి పండుగకు ఈ దఫా కరోనా ఎఫెక్ట్ సోకింది. కరోనాతో ప్రపంచం మొత్తం చివురుటాకులా వణికిపోతున్న నేపథ్యలో ఈ రథయాత్ర చేపట్టవద్దని తొలుత సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో అందరూ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. ప్రపంచానికి పోయేకాలం వచ్చిందని పండితులు రుసరుసలాడారు. ఏంచేస్తాం.. కరోనా మహమ్మారి జడలు విచ్చుకున్న నేపథ్యంలో ఆపేయాల్సిందేనని సుప్రీం గట్టిగా చెప్పింది.
అయినప్పటికీ.. కొందరు మరోసారి ఈ తీర్పును పునః పరిశీలించాలని వేడుకున్నారు. ఈ వేడుకోలు నేప థ్యంలో తాజాగా స్పందించిన సుప్రీం కోర్టు.. రథయాత్రకు పచ్చజెండా ఊపినా.. యాభై మందికి మించి ఎవరూ పాల్గొనరాదని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలనితాజాగాఆదేశాలు జారీ చేసింది. దీంతో రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ లభించినా.. లక్షల సంఖ్యలో పాల్గొనే ప్రజల పాలిట అశనిపాతమేనని అంటున్నారు భక్తులు. ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా పేరుతెచ్చుకున్న అతి పెద్ద రథయాత్రను కూడా కరోనా వదలి పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జగన్నాథ రథయాత్ర భక్తులు లేకుండానే సాదాసీదాగానే నడిచిపోతుంది.. టీవీల్లోనే చూసి తరలించాల్సిందే!!