ఆంధ్రప్రదేశ్ లో యూజీ, పీజీ పరీక్షలు రద్దు అని నిన్న ఒక వార్తా బయటకి వచ్చింది. ఆ వెంటనే రాష్ట్రమంతా పాకేసింది. ఇది చదివిన విద్యార్థుల ఆనందానికి అవదులు లేవు, వారి తల్లిదండ్రులు కూడా హమ్మయ్య కరోనా ముప్పు తప్పిందిలే అనుకున్నారు. ఒకింత ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో వేరే రాష్ట్రాలు కూడా ఆలోచనలో పడ్డాయి. తమ రాష్ట్రాల్లో కూడా పరీక్షలు రద్దు చేసే యోచనలో పడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక బాంబ్ పేల్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప పరీక్షలు రద్దు చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం లేదని తేల్చి చెప్పారు.. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ అందరూ అయోమయంలో పడ్డారు.

 

బుధవారం నాడు ఆయన ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరీక్షల నిర్వహణ, రాబోయే విద్యా సంవత్సరంలో చేయాల్సిన పనులపై రాష్ట్రంలో ఉన్న 16 యూనివర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో సమీక్షించారు. అనంతరం మంత్రి సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్ నాయకత్వంలో కరోనా నియంత్రణపై స్పష్టమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్తున్నామన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురావుతాయనే ముందుగానే 9వ తరగతి లోవు పరీక్షలు రద్దు చేశామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనుకున్నా కేసులు పెరుగుతున్నందున రద్దు చేశామన్నారు.

 

అయితే యూజీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు పరిస్థితులపై అవగాహన ఉంటుందని.. ఒక్కో యూనివర్సిటీలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉందన్నారు. పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఎలా చేయాలి.. రద్దు చేయాల్సి వస్తే ఏమి చేయాలి అని పూర్తిగా కసరత్తు చేశామని మంత్రి తెలిపారు. ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గురువారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకూ పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రకటించలేదని.. ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం అకాడమిక్ క్యాలెండర్‌ను రూపొందిస్తామని మంత్రి సురేష్ తెలిపారు. మొత్తం మీద మంత్రి ఆదిమూలపు సురేష్ మాటలతో అటు తల్లిదండ్రుల్లో కరోనా భయం.. విద్యార్థుల్లో నిరాశ ఒకేసారి మొదలైందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: