ఆయన దేశ రాజకీయాలనే శాసించినవాడు, రాజకీయ చదరంగంలో ఆరితేరినవాడు. వ్యూహాలు పన్నడంలో దిట్ట, తన తెలివితేటలతో ప్రపంచ నేతలు సైతం ఆశ్చర్యపరిచాడు.. ఇదంతా ఒకప్పటి మాట. మరి ఇప్పుడు.. ఆయన అవకాశవాది, నమ్మిన వారినే నట్టేట ముంచే ఘనుడు, ఆయనకి చాదస్తం బాగా పెరిగిపోయింది. ప్రస్తుత పరిణామాలు చేస్తుంటే రాజకీయంగా ఆయన డీలా పడిపోయినట్టు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. వాస్తవానికి రాజ్యసభ ఎన్నికల్లో నెగ్గాలంటే బలం ఉండాలి. కానీ, ఈ బలం టీడీపీకి లేదు. ఆ విషయం చంద్రబాబుకు తెలిసి కూడా వర్ల రామయ్యను వ్యూహాత్మకంగా దింపారు. కాని, ఆయన ఓడిపోయారు. ఇది జగమెరిగిన సత్యం. అయితే చంద్రబాబు ఆయన పార్టీ నేతలు మాత్రం నైతికంగా తాము విజయం సాధించామని డబ్బా కొట్టుకుంటున్నారు. దీంతో ప్రజలు తలలు బద్దలుకొట్టుకుంటున్నారు. అదేంటి చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారు.. ఆయనకేమన్నా అయిందేమోనని చర్చించుకుంటున్నారు. టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరమైన సంగతి అందరికీ తెలిసిందే.
కాగా, వీరిని తమ దారిలోకి తెచ్చుకోవాలని భావించిన చంద్రబాబు.. విప్ జారీ చేయించి మరీ .. వారిని రాజ్య సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఓటు వేయించుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారు ఎన్నికల్లో ఓటైతే వేశారు కానీ.. అది చెల్లకుండా పోయేలా వ్యూహం రచించుకున్నారు. దీన్ని కూడా తమ విజయం గానే టీడీపీ నేతలు చెబుతున్నారు. వారిని భయపెట్టగలిగామని వారి ఆటలు సాగనివ్వబోమని టీడీపీ నేతలు గొప్పలకు పోతున్నారు. దీంతో ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు స్థాయి వ్యక్తి ఇకనైనా ఇలాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలని.. ప్రతీ దాంతో గొప్పలకు పోవడం కరెక్టు కాదని, ఇకనైనా చంద్రబాబు వాస్తవాలు గ్రహించి రాజకీయాలు చేస్తే బాగుంటుందని ఏపీ ప్రజలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.