ఎత్తుకు పైఎత్తు వేయడం రాజకీయాల్లో కామనే! ప్రత్యర్థుల దూకుడుకు అడ్డుకట్ట వేసే క్రమంలో రాజకీయ నేతలు ఇలాంటి పంథానే అనుసరిస్తారు. అయితే, రాను రాను రాజకీయాల్లో మీడియా పాత్ర ఎక్కవైంది. ఓ పక్షం పార్టీకి కొమ్ము కాయడంలో ఎల్లో మీడియాను మించిన మీడియా మనకు దేశంలోనే ఎక్కడా కనిపించ దు. ఒకప్పుడు మహారాష్ట్రలో శివసేన అధికారిక పత్రిక సామ్నా.. బీజేపీని ఇలానే మోసినా.. ప్రజల పక్షాన అవసరమైనప్పుడు గొంతు సవరించుకుంది. బీజేపీ పాలనలో తప్పులను ఎత్తి చూపించింది. అదేసమ యంలో బీజేపీ పాలకులపై విమర్శల బాణాలను సంధించింది. కానీ, ఏపీలో ఇలాంటి పరిస్థితి మనకు ఎక్కడా కనిపించడం లేదు.
కేవలం టీడీపీ మాత్రమే అధికారంలో ఉండాలని భావించే ఓవర్గం మీడియా.. ప్రజల నిర్ణయాన్ని సైతం తప్పుపట్టేలా.. వ్యవహరించిన తీరు మనం చూశాం. అంతేకాదు, టీడీపీ నేతలపై ఈగ వాలకుండా కూడా చూసుకుంటున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఈ కోవలోనే తాజాగా టీడీపీ మాజీ నాయకుడు, ప్రస్తు తం బీజేపీలో ఉన్న యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఉరఫ్ సుజనా చౌదరి విషయంలోనూ ఈ మీ డియా గొడుగు పడుతోందనే వ్యాఖ్యలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. అదేసమయంలో టీడీపీ ఎవరినైతే భుజాలపైకి ఎక్కించుకుందో వారినే ఈ మీడియా కూడా మోసేస్తోందని అంటున్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యవహారం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెబుతున్నారు.
నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు కూడా ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపిస్తోంది. ఇదిలావుంటే, దీనిపై ఇటీవల ఓ సంచలన విషయం తెరమీదికి వచ్చింది. నిమ్మగడ్డ రమేష్తో హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో సుజనా చౌదరి భేటీ కావడం.. ఈ భేటీలో బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా ఉండడం(ఈయనే నిమ్మగడ్డ తరఫున హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు) తీవ్రంగా రాజకీయాలను ప్రభావితం చేసింది. దీనివెనుక ప్రభు త్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపించారు. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే ఇది జరిగిందని కూడా వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం మరింత ప్రాధాన్య జాబితాలో చేరిపోయింది. వాస్తవానికి ఇది జరిగి దాదాపు నాలుగు రోజులు అయింది.
అయితే, ఇలా.. సుజనాను, టీడీపీని వైసీపీ నేతలు విమర్శించడాన్ని తట్టుకోలేక పోతున్న ఎల్లో మీడియా లోని దమ్మున్న అధినేత.. తాజాగా తీరిగ్గా.. ఈ విషయానికి కొన్ని కొత్త హంగులు అద్దారు. సుజనా వెళ్లి నిమ్మగడ్డను కలిశా రు.. సరే.. అలా కాదు.. మీ పార్టీ నాయకులు కూడా కొందరు వచ్చి.. సుజనా చౌదరిని కలిశారు! ముందు ఈ విషయంపై ఆలోచించుకోండి-అన్నట్టుగా వైసీపీని ఆత్మరక్షణలో పడవేసే కొత్త వ్యూహానికి ఈ దమ్మున్న మీడియా అధినేత తెరదీశారు. అంతేకాదు, వైసీపీలో కీలకంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు.. అదే పార్క్ హయత్ హోటల్లో కలిశారని, తమ కష్టాలను సుజనాకు చెప్పుకొన్నారని కూడా కొత్త రాగం పాడింది ఈ మీడియా. కొసమెరుపుగా వీరిలో ఎవరికీ పార్టీని వీడే ఉద్దేశం లేదని కూడా చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఈ విషయాలు ఆసక్తిగా మారాయి.
వాస్తవానికి ఇలా జరిగే అవకాశం లేదని అంటున్నారు వైసీపీ నాయకులు. సుజనానే తనకు దిక్కులేక టీడీపీని మారి బీజేపీ పంచన చేరిపోయారు. అదేసమయంలో ఆయన రాజధానిపై అనేక వ్యాఖ్యలు చేశారు. రాజధానిని కేంద్రంలోని బీజేపీ కాపాడుతుందని, గొడుగు పడుతుందని, రాజధాని ఎక్కడికీ పోదని చెప్పుకొచ్చారని, కానీ, కేంద్ర బీజేపీ నాయకత్వం ఆయనకు రాష్ట్ర విషయాల్లో నీకెందుకు.. అది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం.. నువ్వు ఎందుకు వేలు పెడతావని తలంటిన విషయాన్ని వైసీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. నిజంగా కేంద్రంలోని బీజేపీని ప్రభావితం చేయగలిగే నాయకుడే అయితే.. ఇప్పుడు రాజధాని ప్రజలకు మొహం ఎందుకు చాటేస్తారని సుజనాను ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి కరివేపాకు వంటి నాయకులతో వైసీపీలో విజయం సాధించి.. జగన్ కృషిని నమ్ముకున్న నాయ కులకు భేటీ కలవాల్సిన అవసరం లేదని వైసీపీ సీనియర్లు కుండబద్దలు కొడుతున్నారు. ఇదంతా కూడా ఎల్లో మీడియా ఆడుగున్న `మైండ్ గేమ్` అని.. సదరు మీడియా ఈ వార్తలకు ఎలాంటి ఆధారాలను చూపించలేదని, నిజానికి ఇలాంటిది ఏదైనా జరిగి ఉండి.. ఎవరైనా వైసీపీ నాయకులు సుజనాను కలిసి ఉంటే... ఆ మాట ఆయనే చెప్పి ఉండేవారు కదా.. అంటున్నారు. పోనీ.. పేర్లు చెప్పడానికి ఇష్టపడకపో యినా.. ``నన్ను.. ఒక్క కామినేని, నిమ్మగడ్డ మాత్రమే కలవలేదు. వైసీపీ నుంచి కూడా ఎంపీలు, ఎమ్మెల్యే లు వచ్చి.. అనేక విషయాలపై చర్చించారు`` అని సుజనానే సంచలనాన్ని సృష్టించి ఉండేవారు కదా! అంటున్నారు. మొత్తంగా వైసీపీ వర్సెస్ సుజనా వ్యవహారంలో ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు.